-
-
Home » Andhra Pradesh » Chittoor » ABN Andhrajyothy inside on YS Jagan Tirupati Sabha Fail-MRGS-AndhraPradesh
-
YS Jagan సభలో ఎందుకిలా జరిగింది.. ఒక్కసారిగా డీలాపడిన YSRCP కేడర్.. సినిమా కనిపించింది..!
ABN , First Publish Date - 2022-05-09T20:37:59+05:30 IST
YS Jagan సభలో ఎందుకిలా జరిగింది.. ఒక్కసారిగా డీలాపడిన YSRCP కేడర్.. సినిమా కనిపించింది..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తిరుపతికి వచ్చారు వెళ్ళారు. ఆయన ఐదుగంటల పర్యటన జనానికి నరకం చూపింది. పోనీ ఆయనమైనా కొత్తజిల్లాలకు వరాలు ప్రకటించారా అంటే అదీ లేదు. కేవలం కాసేపు సొంత డబ్బా కొట్టారు. యాజ్ యూజువల్గా ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) కాలంలో మొదలైన ఆస్ప్రతులకు, వంతెనలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ సభకు బెదిరించి జనాన్ని తీసుకొచ్చారు. ఇక తప్పక సభకు వచ్చిన జనం జగన్ మైకందుకోకముందే గోడలు దూకి మరీ పరారయ్యారు.. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో చూద్దాం.
జగన్ తిరుపతి సభ ఎన్నో ప్రశ్నలు!
తిరుపతిలో జగన్ సభ నుంచి జనం పరారవడం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని వైసీపీ కేడర్ లోలోపల మధనపడుతోందిట. ఒకనాడు జగన్ కోసం ఎగబడిన జనం నేడేందుకు గోడలు దూకి మరీ పరారవుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారుట. తమ లెక్క ఎక్కడో తప్పుతోందని భయపడుతున్నారుట. తిరుపతిలో (Tirupati) జగన్ సభ వైసీపీకి ఏదో అంతర్గత సందేశాన్ని అందిస్తోందని, దానిని అర్థం చేసుకోకపోతే తమ పని ఇంతే సంగతులని ఆ పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారుట. మొత్తానికి జగన్ తిరుపతి సభ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అసలేంటి కథ..!
నిజానికి జగన్ సభకు జనాన్ని పోగేయడానికి రకరకాల ప్రయత్నాలు సాగాయి. ఇందులో బెదిరింపులు ఉన్నాయి. సభకు రాకపోతే ఫైన్ వేస్తామనే హెచ్చరికలూ ఉన్నాయి. ఇంతా చేసి మరీ డ్వాక్రా (Dwakra) మహిళలను ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు! కానీ... జగన్ మైకు ముందుకు వచ్చేసరికే జనం గుంపులు గుంపులుగా మైదానం విడిచి వెళ్లిపోవడం మొదలైంది. ‘బలవంతంగా రప్పించవచ్చు. కానీ... బలవంతంగా కూర్చోబెట్టలేరు’ అని అధికారులకు అర్థమైంది. ‘విద్యా దీవెన’ త్రైమాసిక నిధుల విడుదల పేరుతో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు అధికారులునుంచే పెద్దఎత్తున కసరత్తు చేశారు.
సభకు రాకపోతే జరిమానా కట్టాల్సిందే..
ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులను, డ్వాక్రా సంఘాల మహిళలను రప్పించాలని నిర్ణయించి... అధికారులకు టార్గెట్లు పెట్టారు. ఆ అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచారు. ‘సభకు రాకపోతే జరిమానా (Fine) కట్టాల్సిందే’ అంటూ రిసోర్స్ పర్సన్లు డ్వాక్రా మహిళలను హెచ్చరించారు. ఆ వాయిస్ రికార్డులన్నీ వైరల్గా మారాయి. సీఎం సభకు అధికారులు డ్వాక్రా మహిళలను, విద్యార్థులను బలవంతంగా తరలించారు. ఉదయం 8 గంటల నుంచే తరలింపు మొదలైంది. 9 గంటలయ్యేసరికి కుర్చీలు, స్టేడియంలో వేదిక ముందువైపున ఉన్న సిమెంటు చప్టాలు జనంతో దాదాపుగా నిండిపోయాయి.
కారణమిదేనా..!
11 గంటలకు రావాల్సిన సీఎం (CM) గంట ఆలస్యంగా 12 గంటలకు వచ్చారు. అప్పటికే మూడు నాలుగు గంటలుగా వేచి చూస్తున్న మహిళలు, విద్యార్థులు... ఉక్కపోత, వేడితో విసిగిపోయారు. జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే జనం మెల్లగా లేచి వెళ్లిపోవడం మొదలైంది. సీఎం రాకమునుపే స్టేడియం ఖాళీ అవుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు సీఎం ప్రసంగం ప్రారంభమైంది. ఆయన మైక్ ముందుకొచ్చేసరికి తండోపతండాలుగా మహిళలు, విద్యార్థులు వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు స్టేడియం గేటు మూసి అడ్డుకునేందుకు ప్రయత్నించినా... జనం లెక్కచేయలేదు. గేట్లు తోసుకుని వెళ్లిపోయారు. కొందరు గోడలు దూకి కూడా వెళ్లిపోయారు. ఒకవైపు జగన్ ప్రసంగిస్తుండగానే వందల సంఖ్యలో ఇంటి దారిపట్టారు. మరోవైపు... స్టేడియం వెలుపల ప్రధాన రహదారిపై వైసీపీ (YSR Congress) మద్దతుదారులు కూడా కనిపించలేదు.
సీఎం మాట్లాడేటప్పుడు.. చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి!
తిరుపతిలో జరిగే సీఎం సభకు మీ గ్రామ సమాఖ్యలో ఉండే సభ్యులంతా రావాల్సిందే. సీఎం ప్రోగ్రాం చాలా క్రిటికల్. జాయింట్ కలెక్టర్ జూం సమావేశం పెట్టారు. బస్సులు ఏర్పాటుచేశారు. బస్సులో స్నాక్స్, లంచ్ ప్యాక్లు ఇస్తారు. మీటింగ్ పూర్తయ్యే దాకా లేవకుండా కూర్చోవాలి. సీఎం మాట్లాడేటప్పుడు.. చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి! అంటూ మెప్మాలో పనిచేసే ఓ కమ్యూనిటీ ఆర్గనైజర్ బెదిరించిన ఆడియో వాట్సాప్ల్లో షికారు చేసింది. ఇది చాలదన్నట్టు ‘సీఎం మీటింగ్కు ప్రతి గ్రూప్ నుంచి ఐదుగురు సభ్యులు కచ్చితంగా హాజరు కావాలి. అలా హాజరు కాకపోతే ఒక్కొక్కరూ రూ.500 చొప్పున ప్రతి సంఘం రూ.2500 చెల్లించాలి. లేకపోతే మీరు వేరే రీసోర్స్పర్సన్ పరిధిలోకి వెళ్లండి. పై అధికారులు చెప్పినప్పుడు వారి ఆదేశాలను మేం పాటించాలి. మీరు మా ఫోన్లను ఎత్తకపోయినా పర్వాలేదు. సీఎం సభకు రాకపోతే రాకపోతే 500 చొప్పున డబ్బులివ్వండి. ఆ డబ్బులు వేరే వాళ్లకు ఇచ్చి జనాలను తీసుకెళ్తాం. ఇందులో దయాదాక్షిణ్యాలు లేవు!’’ అంటూ బెదిరింపులకు దిగడంతో జనానినికి జగన్ పరిపాలన సంగతేంటో అర్థమైపోయింది. ఈ ఆడియోలన్నీ బయటకు రావడంతో వైసీపీ కేడర్ను ఇరకాటంలో పెడుతోంది. పోనీ బెదిరించో బతిమాలో జనాన్ని తీసుకువచ్చినా జనం కాసేపు కూడా కూర్చోలేకపోయారు. జగన్ మైక్ అందుకోకముందే గోడలు దూకి మరీ పరారవడం ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిజానికి చంద్రబాబు హయాంలోనే..
ఇక తిరుపతిలోని అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో టీటీడీ (TTD) సహకారంతో టాటా ట్రస్టు నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. రూ. 180 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ నిజానికి చంద్రబాబు సీఎంగా వుండగా రతన్ టాటాతో (Ratan Tata) చర్చించి ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ బోర్డులో తీర్మానం చేయించారు. అనంతరం ఆయన హయాంలోనే రతన్ టాటాతో కలసి శంకుస్థాపన కూడా చేశారు. ఆస్పత్రి నిర్మాణం కొంతకాలం కిందటే పూర్తి కావడంతో అనధికారికంగా ఆస్పత్రి నడుస్తోంది. అలాగే చంద్రబాబు హయాంలోనే పురుడు పోసుకున్న శ్రీనివాస సేతును సీఎం జగన్ ప్రారంభించారు. మొదటి దశ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇప్పటికే ప్రారంభం కాగా జగన్ ప్రారంభించడమనేది లాంఛనమే అయింది. ఇలా మొత్తం మీద జగన్ తిరుపతి సభ ఆ పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. సభ జరిగిన తీరుతో వైసీపీ నేతలు డీలాపడ్డారని ఆ పార్టీ ఇన్ సైడ్ టాక్.