కొత్త వ్యూహాలకు పదును పెడూతూ.. పాత సెంటిమెంట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న Revanth... ఈ సభతో నేతలంతా ఒక్కటవుతారా..!?

ABN , First Publish Date - 2022-04-25T20:29:57+05:30 IST

తెలంగాణలో పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. కొత్త వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు..

కొత్త వ్యూహాలకు పదును పెడూతూ.. పాత సెంటిమెంట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న Revanth... ఈ సభతో నేతలంతా ఒక్కటవుతారా..!?

తెలంగాణలో పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. కొత్త వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు.. పాత సెంటిమెంట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సెంటిమెంట్‌కు అనుకూలంగా ఓ భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారు. అదికూడా ఆ పార్టీకి అచ్చొచ్చిన చోటే జరుపుతారట. మరి ఆ సభలోనైనా వర్గ విభేదాలు అంతమవుతాయా? హస్తం నేతలు అంతా ఒక్కటవుతారా? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


వరంగల్ సభలను గుర్తు చేసుకుంటున్న నేతలు

గతంలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చిన ప్రతీసారి వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలను గుర్తుచేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి. అప్పట్లో చనిపోయిన రైతుకుటుంబాలను పరామర్శించేందుకు ఏకంగా సోనియాగాంధీ ఇక్కడికి తరలివచ్చారు. వరంగల్ జిల్లా శాయంపేట మండలంలో రైతుల కుటుంబాలను సోనియాగాంధీ పరామర్శించారు. సోనియాగాంధీ పర్యటన అప్పడు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. తర్వాత వరంగల్‌లో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది కాంగ్రెస్. ఆ తర్వాత జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్‌ను ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు హస్తం నేతలు.


ఊహించిన దానికంటే ఎక్కువగానే..

తెలంగాణ కాంగ్రెస్ సారధ్య పగ్గాలను రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత గులాబీ సర్కార్‌పై పోరును ఉధృతం చేసింది కాంగ్రెస్. కొత్త పీసీసీ చీఫ్‌గా నియామితులయ్యాక కార్యకర్తల్లో వచ్చిన ఊపును కొనసాగించడానికి వరుస కార్యక్రమాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెచ్చిన దళితబంధు అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖిస్తోంది కాంగ్రెస్. దాంతో దళిత బంధుకు కౌంటర్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో జనాల్లోకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. ఇంద్రవెళ్లిలో కాంగ్రెస్ ప్రారంభ సభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్  కావడంతో అదే ఊపును కొనసాగిస్తున్నారు. దీంతో మరిన్ని సభలు నిర్వహించి రాష్ట్రాన్ని చుట్టేలాయని నిర్ణయించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కార్యాచరణకు మరింత పదును పెంచారు రేవంత్ రెడ్డి.


సక్సెస్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌

తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాహుల్ గాంధీ ఇప్పటికే సూచించారు. వరంగల్‌లోనే సభను ఏర్పాటు చేస్తే.. సక్సెస్‌ అవడంతో పాటు సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతుందనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే వరంగల్‌కు నేరుగా వచ్చిన రేవంత్ రెడ్డి సభా ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. జనసమీకరణపై స్థానిక నేతలతో సమావేశం అయ్యారు. ఇక్కడ సభ టీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించిన సభల కంటే ఎక్కువ జనాన్ని సమీకరించాలని భావిస్తోంది కాంగ్రెస్‌. వరంగల్ లో సభ సక్సెస్ అయితే... ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయొచ్చనే ఊపు కాంగ్రెస్‌కు జీవం పోస్తోంది.


ఆదరణ తగ్గినప్పుడల్లా తెరపైకి సెంటిమెంట్

సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు ఆదరణ తగ్గినప్పుడల్లా సెంటిమెంట్‌ను రగిలించడం.. దానిని పండించడం ఆనవాయితీ. అందులో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు కూడా. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనసాగించాలనుకుంటున్నారట. వరంగల్‌లో భారీ సభ నిర్వహిస్తే.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తమపార్టీ అధికారంలోకి వస్తుందనేది కాంగ్రెస్ సెంటిమెంట్ అట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈసెంటిమెంట్ నే ఫాలో అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


వరంగల్‌ జిల్లా నేతల్లో మాత్రం వర్గపోరు సమస్య

గతంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు సోనియాగాంధీ వస్తే.. ఇప్పుడు రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీని తీసుకొస్తున్నారు హస్తం నేతలు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రస్తుతం కూడా రైతుల సమస్యలు అలాగే ఉన్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ. అందుకే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన పెట్టుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సభ సక్సెస్ చేయాలనే భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ఇక్కడి నేతల్లో మాత్రం వర్గపోరు సమస్య అవుతోంది. నాయకుల మధ్య భేదాభిప్రాయాలతో ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా ఉన్నారు.




ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది?

ములుగు భూపాలపల్లి నియోజకవర్గాలు మినహా దాదాపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో కుమ్ములాటలే కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఇటీవల వరంగల్ వచ్చిన రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయ్యేందుకు అందరూ కలిసిపనిచేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాపై పూర్తిగా పట్టుసాధించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలోనే వర్గపోరుకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్‌ వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది...? కాంగ్రెస్ సెంటిమెంట్ ఏమేరకు ఫలితాలిస్తుందో? చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Updated Date - 2022-04-25T20:29:57+05:30 IST