ఆడపిల్ల అని తెలిసి ఘాతుకం.. అబార్షన్ చేసిన వైద్యులు.. చివరకు కథ అడ్డం తిరగడంతో..
ABN , First Publish Date - 2022-03-11T05:38:21+05:30 IST
మహిళలు ఎన్నో సాధిస్తున్న ప్రస్తుత రోజుల్లో కూడా వారి పట్ల వివక్ష పూర్తిగా తొలిగిపోలేదు. మగ బిడ్డే పుట్టాలనుకుంటున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా కోడలి కడుపులో ఆడబిడ్డ పెరుగుతోందనే విషయం తెలుసుకున్న అత్తగారు ఆమెకు తెలియకుండా అబార్షన్...
మహిళలు ఎన్నో సాధిస్తున్న ప్రస్తుత రోజుల్లో కూడా వారి పట్ల వివక్ష పూర్తిగా తొలిగిపోలేదు. మగ బిడ్డే పుట్టాలనుకుంటున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా కోడలి కడుపులో ఆడబిడ్డ పెరుగుతోందనే విషయం తెలుసుకున్న అత్తగారు ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించింది. అయితే అబార్షన్ చేసిన మహిళ పరిస్థితి సీరియస్ అయింది. దీంతో మొత్తం కథ బయటకు వచ్చింది.
హర్యానాలోని కైతాల్ జిల్లాలోని భాటియా గ్రామానికి చెందిన పరంజిత్ అనే యువతికి 2015లో గగన్దీప్ సింగ్తో వివాహం జరిగింది. మూడున్నర నెలల క్రితం పరంజీత్ గర్భం దాల్చింది. ఈ నెల రెండో తేదీన పరంజీత్ తన అత్తగారు సత్యతో కలిసి రాధాకృష్ణ నర్సింగ్ హోమ్కు చెకప్ కోసం వెళ్ళింది. అక్కడ పరంజీత్కు స్కానింగ్ చేసిన డాక్టర్లు రేణు గుప్తా, మనోజ్ కుమార్ ఆడపిల్ల పుట్టబోతోందని సత్యకు చెప్పింది. తీవ్ర నిరాశకు గురైన అత్తగారు తన కోడలికి అబార్షన్ చేయమని డాక్టర్లను అడిగింది.
పరంజీత్కు తెలియకుండా ఇద్దరూ డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేసేశారు. అయితే అబార్షన్ ప్రక్రియలో తేడా రావడంతో పరంజీత్కు రక్తస్రావం మొదలైంది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరంజీత్ గర్భశాయానికి ఇన్ఫెక్షన్ అయినట్టు ధ్రువీకరించిన వైద్యులు.. ఆపరేషన్ చేసి సరిచేశారు. తనకు అబార్షన్ చేయించినట్టు తెలుసుకున్న పరంజీత్ తన అత్తగారు, ఇద్దరు వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే చట్ట వ్యతిరేకంగా గర్భంలో బిడ్డ లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల అని చెప్పినందుకు ఆ డాక్టర్లపై మరో కేసు కూడా నమోదైంది.