విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-06-27T06:59:10+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు అన్నారు.
సూర్యాపేట అర్బన్, జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్ పిలుపు మేరకు ఈనెల 27, 28, 29 తేదీల్లో మండల కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని, ‘మన ఊరు, మనబడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవవేతనం రూ.3 వేలకు పెంచే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. విద్యాశాఖలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్కుమార్, సోమయ్య, అరుణభారతి, వెంకటయ్య, యాకయ్య, వీరారెడ్డి, నాగేశ్వర్రావు, సోమయ్య, కమల, రమేష్, ఆడం, లాలూ, క్రాంతిప్రభ, శ్రీనివాసాచారి, పిచ్చయ్య, లక్ష్మీనారాయణ, ఆనంద్, యాదయ్య, నాగు, ఉపేందర్, శ్రీను పాల్గొన్నారు.