నీటి పైపుల్లో నోట్ల కట్టలు!
ABN , First Publish Date - 2021-11-25T08:34:44+05:30 IST
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు తమ అక్రమార్జనను దాచుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
కర్ణాటకలో 60 చోట్ల ఏసీబీ సోదాలు
బెంగళూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు తమ అక్రమార్జనను దాచుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కర్ణాటకలో ఓ అధికారి నీటిపైపుల్లో నోట్ల కట్టలు దాచడంతో అధికారులు అవాక్కయ్యారు. బెంగళూరు, బెళగావితోపాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో 60 చోట్ల 15మంది అధికారులకు చెందిన నివాసాలపై బుధవారం దాడులు నిర్వహించి రూ.కోట్ల విలువైన పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. కలబుర్గి జిల్లా జీవర్గి ప్రజాపనులశాఖ జేఈ శాంతగౌడ బిరాదార్ నివాసంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన నీటి పైపుల్లో నగదు భద్రపరిచినట్టు గుర్తించారు. బెంగళూరులో కేఏఎస్ అధికారి నాగరాజ్, యలహంక ప్రభుత్వ ఆసుపత్రి ఫిజియో థెరపిస్ట్ రాజశేఖర్, బీబీఎంపీ అధికారులు గిరి, మాయణ్ణ నివాసాలపైనా దాడులు నిర్వహించారు. 480 మందికిపైగా అధికారులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నట్టు తెలిసింది.