మృత్యువులోనూ వీడని మైత్రి

ABN , First Publish Date - 2022-08-19T06:01:30+05:30 IST

మృత్యువులోనూ వీడని మైత్రి

మృత్యువులోనూ వీడని మైత్రి
ప్రమాదంలో తగలబడిన బైకు

జూపూడి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి

స్నేహితుడిని బస్టాప్‌ వద్ద దించేందుకు వెళ్తుండగా..

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు


జూపూడి (ఇబ్రహీంపట్నం), ఆగస్టు 18 : మతాలు వేరైనా మనసులు ఒక్కటేననుకున్నారు. చిన్నతనం నుంచీ కలిసి పెరిగారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. చివరికి మృత్యుఒడికీ కలిసే చేరుకున్నారు.  జూపూడి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగిసిన ఇద్దరు స్నేహితుల కథ ఇది. కళాశాలకు సమయం మించిపోతోందన్న కంగారులో అనుకోకుండా బైకుపై రోడ్డు దాటడంతో వేగంగా వచ్చిన కారు ఇద్దరినీ ఢీకొంది. అప్పటివరకు సరదా కబుర్లతో సందడిగా బయల్దేరిన వారిద్దరూ క్షణాల్లో మృత్యుఒడికి చేరారు. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జూపూడి గ్రామానికి చెందిన యాకూబ్‌ బాషా (17), ఇంటర్‌ విద్యార్థి చిన్నం ప్రశాంత్‌ (17) ప్రాణ స్నేహితులు. పదో తరగతిలోనే చదువు ఆపేసిన యాకూబ్‌ బాషా తండ్రి షేక్‌ బాజీకి చేదోడుగా ఉంటూ కూలి చేసుకుంటున్నాడు. తల్లి షాహిదాతో పాటు అన్నయ్య మీరా హుస్సేన్‌, చెల్లి హసిన ఉన్నారు. మరో యువకుడు చిన్నం ప్రశాంత్‌ ఇంటర్‌ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రశాంత్‌ తండ్రి శేఖర్‌ కూలి చేసుకుంటూ కొడుకును ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ప్రశాంత్‌కు తల్లి గాయత్రి, తండ్రి శేఖర్‌తో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. గురువారం ప్రశాంత్‌ కాలేజీకి సమయం మించిపోవడంతో యాకూబ్‌ తన ద్విచక్రవాహనంపై బస్టాప్‌ వద్ద దించేందుకు తీసుకెళ్లాడు. జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా, విజయవాడ వైపు నుంచి కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. దీంతో ఇద్దరూ ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. వాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు

విషాదంలోనూ మృతుల కుటుంబాలు మానవత్వాన్ని చాటుకున్నాయి. కుమారులు మృతిచెందినా వారి నేత్రాలు దానం చేయటానికి ముందుకొచ్చి ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు సమాచారం అందించారు.







Updated Date - 2022-08-19T06:01:30+05:30 IST