వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-03T04:43:42+05:30 IST

మండల పరిధిలోని గొట్టెల్ల గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన నూకల చిన సుబ్బారావు (27)అనే యువకుడు మృతి చెందాడు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ఘటన ప్రదేశంలో యుగందర్‌, మాలతి మృతదేహాలు

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఒకరు, ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ నుంచి వస్తూ మరో ఇద్దరు

రహదారులపై నిలిపి ఉంచిన వాహనాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. అర్థరాత్రి కావటంతో ద్విచక్ర వాహనాలు ఆయా ప్రాంతాల్లో లారీ, ట్రాక్టర్‌ ట్రక్కును ఢీ కొట్టటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఈ ఘటను చోటుచేసుకున్నాయి. పినపాక మండలంలో ఒక ఘటన జరగగా, కామేపల్లి మండలంలో మరో ఘటన జరిగింది..

పినపాక, డిసెంబరు2:  మండల పరిధిలోని గొట్టెల్ల గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన నూకల చిన సుబ్బారావు (27)అనే యువకుడు మృతి చెందాడు.  స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం.. చినసుబ్బారావు బుధవారం టీ కొత్తగూడెం గ్రామంలోని మేనత్త అనారోగ్యంతో చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో గొట్టెల్ల గ్రామం వద్ద పంక్చర్‌ కావడంతో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీని ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. ఏడూళ్లబయ్యారం సీఐ రమేష్‌ విచారణ చేపట్టారు.       

హైదరాబాద్‌ నుంచి ద్వి చక్ర వాహనంపై వస్తూ మరో ఇద్దరు

కామేపల్లి: మండల పరిధిలోని పండితాపురం బైపాస్‌ రోడ్డులో ఇద్దరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పాడు మండలం సారపాకకు చెందిన కుసుమ రాజు యుగందర్‌(19), వరుసకు పిన్ని కర్రి మాలతి (25)తో కలసి స్కూటీపై హైదరాబాద్‌ నుంచి బుధవారం తెల్లవారు జామున వస్తున్నాడు. ఈక్రమంలో పండితా పురం వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ స్రవంతి కేసు నమోదు చేశారు

Updated Date - 2020-12-03T04:43:42+05:30 IST