‘డీసీఎం ఇన్చార్జిపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2021-05-11T04:51:07+05:30 IST
నందలూరు మండలం డీసీఎం ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పాటూరు సర్పంచ్ మోహన్రెడ్డి, రైతులు శ్రీను, వెంకటే్ష ఆరోపించారు.
నందలూరు, మే10 : నందలూరు మండలం డీసీఎం ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పాటూరు సర్పంచ్ మోహన్రెడ్డి, రైతులు శ్రీను, వెంకటే్ష ఆరోపించారు. సోమవారం వీరు మాట్లాడుతూ తాము వరి పంటను పండించి వరి కుప్పలు వేసి పది రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయలేదని, సంచులను సైతం కమిషన్ల కోసం కోడూరు, దూర ప్రాంతాలకు వెళ్లి తమనే తెచ్చుకోవాలన్నారన్నారు. పది రోజుల నుంచి ధాన్యం పొలాల్లోనే కుప్పలుగా వేశామని ఎప్పుడు వర్షం పడుతుందో అని భయాందోళనలో ఉన్నామన్నారు. ధాన్యం కుప్పలు కప్పుకోవడానికి పట్టల బాడుగకు రోజుకు రెండు వేల రూపాయలపైగా చెల్లిస్తున్నామని ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్బాల్పై చర్యలు తీసుకొని తమ పంటను ప్రభుత్వం సకాలంలో తీసుకెళ్లేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై డీసీఎం ఇన్చార్జి ఇక్బాల్ను వివరణ కోరగా జాబితా ప్రకారం సంచులు ఇస్తున్నాం, కానీ రైతులు తొందరపడుతున్నారన్నారు. ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేటకు ఒక్కడినే ఇన్చార్జిగా ఉన్నందున ఇబ్బందిగా ఉందన్నారు. కానీ తాను ఎటువంటి కమీషన్లకు ఆశపడలేదని పేర్కొన్నారు.