అక్రమాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2022-05-17T06:41:39+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని సివిల్‌ సప్లయీస్‌ ఎండీ వీరపాండ్యన్‌ హెచ్చరించారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న వీరపాండ్యన్‌

మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు

రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలి

రేషన్‌ పంపిణీలో అప్రమత్తంగా ఉండాలి

సివిల్‌ సప్లయీస్‌ ఎండీ వీరపాండ్యన్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 16 : ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని సివిల్‌ సప్లయీస్‌ ఎండీ వీరపాండ్యన్‌ హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం పౌరసరఫరాలు, మార్కెటింగ్‌, సహకార, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రైతుల వద్ద నుంచి సేకరించిన ఆధార్‌, బ్యాంకు నెంబర్లు తప్పులతడకగా పంపడంతోనే చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో  రైతుల బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆధార్‌, బ్యాంకు అకౌంట్ల నెంబర్లు సరిచేసి పంపిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల్లో  తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రేషన్‌ పంపిణీ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది తనిఖీలు నిర్వహించకపోవడంతోనే అక్రమాలు జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుదారులకు బియ్యం చేరే విధంగా చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖకు ఉందనే విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. వచ్చేనెల నుంచి షెడ్యూల్‌ ప్రకారమే రేషన్‌ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై అదనంగా రోజులు కేటాయిం చేది లేదని స్పష్టం చేశారు. తొలుత జేసీ అభిషిక్త్‌ కిషోర్‌  జిల్లాలో ధాన్యం సేకరణ, రేషన్‌ పంపిణీ తదితర అంశాలను వివరించారు. ఆయాశాఖల అధికారులు గ్లోరియా, శ్యామ్‌కుమార్‌, రాజశేఖర్‌, ఉపేంద్ర పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:41:39+05:30 IST