ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
ABN , First Publish Date - 2021-04-18T05:49:34+05:30 IST
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె శశాంక మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
- జిల్లా కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె శశాంక మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వేసవిలో తాగునీటి సరఫరా, సమీకృత మార్కెట్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్లు, హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీల సంరక్షణ, పారిశుధ్య చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, ప్రతిరోజు 5-10 నిమిషాలు నీటి సరఫరా పెంచాలని సూచించారు. రోజు క్లోరినేషన్ చేసిన తాగునీరు సరఫరా చేయాలన్నారు. పట్టణాలలో పైపులైన్ల లీకేజీ ఉంటే వెంటనే అరికట్టాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా మున్సిపాలిటీలలో గల బోర్వెల్స్కు మరమ్మతు చేయించాలని ఆదేశించారు. హుజురాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి మే నెలలో పూర్తిస్థాయిలో తాగునీరందించాలని ఆదేశించారు. సరఫరా చేస్తున్న తాగునీటిని మొదటిగా వాటర్ సోర్స్ వద్ద, ఓహెచ్ఆర్ల వద్ద, డెలివరీ పాయింట్ల వద్ద పరీక్షలు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నారు. జిల్లాలో కోవిడ్ ఉధృతంగా ఉన్నందున ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు రోజు ఉదయం వార్డులను సందర్శించాలని, పారిశుధ్య చర్యలు, తాగునీటి సరఫరా జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేయాలని, తనిఖీ ఫొటోలను రోజు 8 గంటలలోపు వాట్సప్ ద్వారా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలకు మంజూరైన పబ్లిక్ టాయిలెట్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. మున్సిపాలిటీలకు గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు నాటుటకు అవసరమైన మొక్కలను డీఆర్డీవో, అటవీశాఖ నర్సరీల నుంచి తెప్పించుకొని పెంచుకోవాలని సూచించారు. అన్ని వార్డులలో గ్రీన్ పార్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. 85 శాతం మొక్కలు రక్షించబడాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపాలిటీ సిబ్బంది, వర్కర్లు అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు నెలనెలా చెల్లించాలని ఆదేశించారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేసి పూర్తి చేయించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు ప్రసన్నరాణి, రషీద్, అంజయ్య, వేణుమాధవ్, ఎస్ఆర్ఎస్పి ఈఈ నాగభూషణం, మున్సిపల్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.