బీజేపీని గడపగడపకూ చేర్చే బాధ్యత కార్యకర్తలదే..
ABN , First Publish Date - 2022-07-01T05:55:36+05:30 IST
బీజేపీని గడపగడపకూ చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని బీజేపీ ఐటీసెల్ కోకన్వీనర్ అమిత్ మాలావ్యా అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతీ కార్యకర్త పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పని చేయాలని అన్నారు.
కామారెడ్డి టౌన్, జూన్ 30: బీజేపీని గడపగడపకూ చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని బీజేపీ ఐటీసెల్ కోకన్వీనర్ అమిత్ మాలావ్యా అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతీ కార్యకర్త పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పని చేయాలని అన్నారు. పని చేసిన కార్యకర్తకు తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుందని, మిగతా పార్టీల్లా బీజేపీ కుటుంబ పార్టీ కాదని అన్నారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు. పార్టీలో కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు అందరూ సమానమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉందని ప్రజలకు హామీలు ఇవ్వడమే తప్ప అమలుకు నోచుకోవడం లేదని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించే జాతీయ సమావేశాలకు ప్రతీ ఒక్క కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీధర్గౌడ్, వెంకటరమణరెడ్డి, చిన్నరాజులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం పని చేసిన వారికే భవిష్యత్తు : ఎల్లారెడ్డి ఇన్చార్జి భారతీబెన్ దీర్భాయి
ఎల్లారెడ్డి : పార్టీ కోసం పని చేసిన వారికే భవిష్యత్తు ఉంటుందని వారిని పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని, పార్టీ సిద్ధాంతాలను పాటించాలని గుజరాత్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు భారతీబెన్ దీర్భాయి అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్హాల్లో తెలంగాణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో ఉన్నత పదవులు ఉంటాయన్నారు. మోదీ కిందిస్థాయి నుంచి ఒక దేశ ప్రధాని అయ్యారని ఆయనను ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం పని చేయాలని బీజేపీలో కుటుంబపాలన ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, పైలా కృష్టారెడ్డి, చైతన్యగౌడ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్లో అభివృద్ధి శూన్యం : జుక్కల్ ఇన్చార్జి విశాల్గోలే
పిట్లం: వెనుకబడిన ప్రాంతం అయిన జుక్కల్ నియోజకవర్గంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్షిండే పెద్ద పెద్ద నాయకులు ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విశాల్గోలే అన్నారు. గురువారం పిట్లం రాజరాజేశ్వర గార్డెన్లో పిట్లం-నిజాంసాగర్ మండలాల బీజెపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విశాల్గోలే విచ్చేశారు. వారికి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అరుణతార పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యవర్గ సమావేశంలో విశాల్గోలే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇంతవరకు డబుల్ బెడ్రూంలు ఎందుకు నిర్మించలేక పోయారన్నారు. అదే పక్కనే ఉన్న బాన్సువాడ పట్టణంలో వందల బెడ్రూంలు నిరుపేదలకు అందించారని, జుక్కల్ నియోజకవర్గంలో ఎందుకు నిర్మాణం జరుగలేదని ఇదంతా ఎంపీ, ఎమ్మెల్యేల చేతకాని పనితనం అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో గడపడగపకూ బీజేపీ పథకాలను కార్యకర్తలు తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో బారీ మెజారిటీతో పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. 3వ తేదీన హైదరాబాద్లో జరిగే బీజేపీ బహిరంగ సభను కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ప్రధాన మంత్రి బహిరంగ సభకు వేలాది సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోనికి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు అరుణతార. జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, మండల అధ్యుక్షుడు అభినయ్రెడ్డి, అశోక్రాజ్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.