ఎవరి కోసం ఎదురు చూడొద్దు
ABN , First Publish Date - 2020-11-30T04:39:09+05:30 IST
విపత్కర సమయాల్లో ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మనవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చునని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఎమ్మెల్యే అదీప్రాజ్తో కలిసి అప్పన్న దర్శనం
సింహాచలం, నవంబరు 29: విపత్కర సమయాల్లో ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మనవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చునని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడి అదీప్రాజ్తో కలిసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంతో పోలిస్తే కొవిడ్ దుష్ప్రభావం మనదేశంలో తక్కువగానే ఉందని, సెకండ్ వేవ్ నేపథ్యంలో అందరూ కరోనా నిబంధనలను పాటించడం ద్వారా వైరస్కు అడ్డుకట్ట వేయాలన్నారు.
విశాఖ అందాలకు ఫిదా..
జంద్యాల, ఈవీవీ దర్శకత్వంలో నటించిన పలు సినిమాలను ఇక్కడ చిత్రీకరించడం ద్వారా విశాఖ అందాలకు ఫిదా అయిపోయానని రాజేంద్రపసాద్ పేర్కొన్నారు. విశాఖలో షూటింగ్ ఉంటే తప్పనిసరిగా అప్పన్న స్వామిని దర్శించుకుంటానన్నారు. ప్రస్తుతం భీమిలి పరిసరాల్లో జరుగుతున్న ‘కోతి కొమ్మచ్చి’, అరకులో షూటింగ్ జరుపుకుంటున్న ‘గాలి సంపత్‘లో నటిస్తున్నానన్నారు. త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్-3’లో కూడా నటిస్తున్నట్టు చెప్పారు.