Uttar Pradesh లో రూ.70 వేల కోట్లు పెట్టుబడి: Gautham Adani
ABN , First Publish Date - 2022-06-03T21:09:04+05:30 IST
అదానీ గ్రూపుల(Adani) అధినేత గౌతమ్ అదానీ(Gautham Adani) భారీ పెట్టుబడి ప్రకటన చేశారు.
లక్నో : అదానీ గ్రూపుల(Adani) అధినేత గౌతమ్ అదానీ(Gautham Adani) భారీ పెట్టుబడి ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లో రూ.70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ పెట్టుబడులతో యూపీలో దాదాపు 30 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2022’’లో ప్రసంగం సందర్భంగా ఆయనీ ప్రకటన చేశారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడిలో ఇప్పటికే రూ.11 వేల కోట్లు ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ, వాటర్, అగ్రి-లాజిస్టిక్స్తోపాటు తమ డేటా సెంటర్ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశామన్నారు. రోడ్డు, రవాణా మౌలికసౌకర్యాలపై మరో రూ.24 వేల కోట్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్తోపాటు రక్షణరంగంలో రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని అదానీ వివరించారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దక్షిణాసియాలోనే అతిపెద్ద అమ్మోనియం కాంప్లెక్స్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని ప్రకటించారు. యూపీ డిఫెన్స్ కారిడార్లో ఇదే అతిపెద్ద ప్రైవేటు సెక్టార్ పెట్టుబడి అవుతుందని అదానీ పేర్కొన్నారు. నేటి ఉత్తరప్రదేశ్ భవిష్యత్ భారత్ను నిర్వచించగలదనేందుకు తమ అతిపెద్ద పెట్టుబడులే సంకేతమని గౌతమ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత పూర్వవైభవాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అదానీ ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ పునాధి వేశారని అన్నారు.