హెల్త్‌కేర్‌లోకి అదానీ

ABN , First Publish Date - 2022-05-19T06:40:24+05:30 IST

హెల్త్‌కేర్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు భారత కుబేరుడు అదానీ గ్రూప్‌ బుధవారం ప్రకటించింది.

హెల్త్‌కేర్‌లోకి అదానీ

ఏహెచ్‌వీఎల్‌ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు 

త్వరలో ఈ రంగంలోనూ భారీ కొనుగోళ్లు

రూ.30 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం   


ముంబై: హెల్త్‌కేర్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు భారత కుబేరుడు అదానీ గ్రూప్‌ బుధవారం ప్రకటించింది. మెడికల్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు పలు మార్గాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు ‘అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ (ఏహెచ్‌వీఎల్‌) పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు ద్వారా సిమెంట్‌ రంగంలోకి అడుగుపెడుతున్న అదానీ.. తద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అవతరించనుంది. కొద్ది రోజుల క్రితమే కుదుర్చుకున్న ఈ డీల్‌ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.  2014 నుంచి ఆయా రంగాలకు చెందిన 30కి పైగా కంపెనీలు, వ్యాపారాలను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌.. ఇక హెల్త్‌కేర్‌ రంగంలోనూ భారీ కొనుగోళ్లకు పాల్పడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశీయ కార్పొరేట్‌ హాస్పిటళ్లు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఫార్మసీ, డయాగ్నోస్టిక్‌, హెల్త్‌ టెక్‌ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన పలు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్టర్లు ప్రస్తుతం వైదొలిగే ప్రయత్నాల్లో ఉన్నారని.. వారి వాటాలు చేజిక్కించుకునేందుకు అదానీ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హెల్త్‌కేర్‌ రంగంలో 400 కోట్ల డాలర్ల (దాదాపు రూ.30,000 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టేందుకు అదానీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-05-19T06:40:24+05:30 IST