ముంద్రా డ్రగ్స్ కేసు ఎఫెక్ట్: అదాని పోర్ట్స్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-10-12T01:46:43+05:30 IST
ముంద్రా పోర్టులో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో అదాని పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: ముంద్రా పోర్టులో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో అదాని పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎలాంటి ‘ఎగ్జిమ్’ (ఎగుమతి-దిగుమతి) చేయబోమని ప్రకటించింది. నవంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సోమవారం స్పష్టం చేసింది. అదాని పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీసెజ్) ఆపరేట్ చేసే అన్ని పోర్టులతోపాటు, ఏపీ సెజ్లోని థర్డ్ పార్టీ టెర్మినల్స్కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. అదాని ఏడు రాష్ట్రాల్లో 13 దేశీయ పోర్టులను నిర్వహిస్తోంది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా వంటివి ఉన్నాయి.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గత నెలలో గుజరాత్ కచ్లోని ముంద్రా పోర్టులో 3 వేల కేజీల హెరాయిన్ను పట్టుకుంది. ఈ పోర్టును అదాని నిర్వహిస్తోంది. పట్టుబడిన హెరాయిన్ విలువ దాదాపు రూ. 21 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ నుంచి ఏపీలోని విజయవాడ అడ్రస్తో ఎగుమతి కాగా, ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ముంద్రా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అదాని పోర్ట్స్ ఈ నిర్ణయం తీసుకుంది.