అంతర్జాతీయ పద్య పోటీల్లో మూడోసారీ అదరగొట్టిన వనీజ

ABN , First Publish Date - 2022-09-25T17:49:18+05:30 IST

వరుసగా 2020, 2021, 2022లలో అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠన పోటీలలో ‘శ్రీవిద్యానికేతన్’ 6వ తరగతి విద్యార్థిని అద్దంకి వనీజ ప్రథమస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది.

అంతర్జాతీయ పద్య పోటీల్లో మూడోసారీ అదరగొట్టిన వనీజ

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా 2020, 2021, 2022లలో అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠన పోటీలలో ‘శ్రీవిద్యానికేతన్’ 6వ తరగతి విద్యార్థిని అద్దంకి వనీజ ప్రథమస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. వందలాది భాగవతం పద్యాలు.. నోరు తిరగని రఘువీర గద్యం.. నరసింహ గద్యం.. శ్రీనివాసగద్యం లాంటి గద్యలను అలవోకగా అనర్గళంగా చాలా స్పష్టంగా చెప్తూ గత మూడు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అద్దంకి వనీజ ఇప్పుడు మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. ‘రవి గాంచిన పోతన భాగవతం’ పేరిట భాగవతం ఆణిముత్యాలు (IBam) సంస్థవారు న్యూజిలాండ్ నుంచి ఉత్తర అమెరికా వరకూ ఉన్న దేశాలలోని 6-18 సంవత్సరాల పిల్లలకు నిర్వహించిన పోతన భాగవతం పద్యాల అంతర్జాతీయ అంతర్జాల పోటీలో 10-13 వయస్సు విభాగంలో అత్యుత్తమస్థానంలో నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. 


ఈ పురస్కారానికి గానూ 251 డాలర్ల (రూ.20,395) నగదు బహుమతిని IBam సంస్థ అధినేత ప్రకటించారు. గత రెండు నెలలుగా ‘నరసింహ జయంతి నుండి వామన జయంతి వరకూ’ న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, బహ్రెయిన్, ఖతర్, ఒమన్, కువైత్ ఇంకా ఉత్తర అమెరికాలోని అనేక రాష్ట్రాలతో సహా భారతదేశంలోని 500కు పైగా బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. వాటి ఫలితాలను పెద్దలు ప్రాచార్య శలాక రఘునాథశర్మ, తనికెళ్ళ భరణి, ఎల్.వి. సుబ్రహ్మణ్యం, నేమాని పార్థసారథి ఆశీస్సులతో భారత కాలమానం ప్రకారం 24.9.2022 సాయంత్రం గం. 7.30కి జరిగిన సమావేశంలో ప్రకటించారు. తిరుపతి పట్టణంలోని మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వనీజ ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది.


ప్రముఖ సంగీత విద్వాంసుడు, చలనచిత్ర నేపథ్య గాయకుడు అయిన నేమాని పార్థసారథి శిష్యురాలు అద్దంకి వనీజ. వారి వద్ద శాస్త్రీయ సంగీతం, పోతన భాగవతం పద్యాలు నేర్చుకుంటోంది. అలాగే కొమాండూరి రామాచారి వద్ద లలిత సంగీతం నేర్చుకుంటోంది. హైదరాబాద్‌లో సుప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి సూర్యదేవర సింధుజ వద్ద, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత మరియు నృత్యకళాశాలలో సుప్రసిద్ధ కూచిపూడి ఆచార్య ఉషారాణి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తోంది. ఘట్టి బాలచైతన్యంలో ఘట్టి కృష్ణమూర్తి వద్ద తెలుగు సాహిత్యంలోని పద్యాలను నేర్చుకుంటున్న వనీజను గురువులందరూ ఆశీర్వదించారు. 


మరిన్ని పోటీలలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. విజయాల పరంపరలో... మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ.. అంటూ గుక్కతిప్పుకోకుండా ఒక చిన్నారి 5 నిముషాలపాటు చదివిన పోతన భాగవతం-గజేంద్రమోక్షంలోని గద్యం ఒకటి ఇటీవల సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత ఆదరణ పొందింది. వాట్సాప్‌లో అనేకసార్లు షేర్ చేసిన వీడియోగానూ గుర్తింపు పొందింది. ఆ గద్యం చదివిన చిన్నారి ఎవరో కాదు- అద్దంకి వనీజ. తను ఇప్పుడు 2022లో పుచ్చా మల్లిక్ నిర్వహించిన పోతన భాగవతం ఆణిముత్యాలు అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠనపు పోటీలలో ప్రథమ బహుమతిని పొందింది. 2021లో 29 దేశాల నుంచి దాదాపు 1400 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో రావూరి విభాగం నుంచి వనీజ ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. 


ఈ పోటీలను బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ స్థాపించిన ప్రణవపీఠం అలాగే వెంపరాల శ్రీనివాసమూర్తి (న్యూఢిల్లీ)  స్థాపించిన వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా నిర్వహించాయి. 2020 సంవత్సరంలోనూ వాగ్దేవి కళాపీఠం నిర్వహించిన ‘పద్యానికి పట్టాభిషేకం’ అనే పద్య పఠనపు పోటీలలో వనీజ ప్రథమ బహుమతిని పొందింది. 'తానా' వంటి అనేక ప్రపంచసాహిత్య వేదికలపై పద్యగానం చేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ వంటి ఎందరో పెద్దల ఆశీస్సులు పొందింది. ఇలా వరుసగా మూడుసార్లు అంతర్జాతీయంగా పద్యపఠన పోటీలలో నిలిచి అద్దంకి వనీజ హ్యాట్రిక్ సాధించింది.

Updated Date - 2022-09-25T17:49:18+05:30 IST