కాంగ్రెస్‌లో చేరికలు

ABN , First Publish Date - 2021-11-29T04:25:06+05:30 IST

పట్టణంలోని హమాలీవాడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలువురు పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో చేరికలు
మంచిర్యాలలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు

ఏసీసీ, నవంబరు 28: పట్టణంలోని హమాలీవాడలో  ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలువురు పార్టీలో చేరారు.  జంగంపల్లి బాబన్న, ఒన్నోజుల శ్రీనివాచారి, ఆదిత్యచారి, వారి అనుచరులు,  వివిధ పార్టీలకు చెందిన వారు  పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ ద్రోహానికి పాల్పడినందుకు వారి తరుపున తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. పార్టీలు మారే తత్వం ఉందని తెలుసుకోకుండా అలాంటి వారికి టికెట్లు ఇచ్చి గెలిపించినందుకు ప్రజలను క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాటు చేయబోనని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 22 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వారి వార్డులను అభివృద్ధి చేయలేక ప్రజల్లో చులకన అయ్యారని చెప్పారు. కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు కౌన్సిలర్లు వార్డులను అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర తప్పుడు నిర్ణయాల వల్ల చమురు, గ్యాస్‌ ధరలు పెరిగి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, సామాన్యుల బతుకు దుర్భరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు వారి పదవులకు రాజీనామాలు చేసి  మళ్లీ ఎన్నికల్లో పోటీ విజయం సాధించాలని సవాల్‌ విసిరారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఉప్పలయ్య, డిప్యూటి ఫ్లోర్‌ లీడర్లు సంజీవ్‌, మాజిద్‌, కౌన్సిలర్లు బానేష్‌, మహేష్‌, వేణు, పద్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:25:06+05:30 IST