చెట్టు కిందనే గ్రామ పాలన!
ABN , First Publish Date - 2022-01-28T06:33:26+05:30 IST
నిలువ నీడలేక చెట్టు కింద కూర్చుని గ్రామ సర్పంచ్ పాలన సాగిస్తున్న వైనమిది. గ్రామ సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి ప్రతి గ్రామంలో సొంత భవనాల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినా ఇక్కడ మాత్రం వైసీపీ నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
సచివాలయ భవన నిర్మాణం పట్టని పాలకపక్షం..
ఎక్కడి పనులు అక్కడే : టీడీపీ సర్పంచ్ ఆవేదన
నిలువ నీడలేక చెట్టు కింద కూర్చుని గ్రామ సర్పంచ్ పాలన సాగిస్తున్న వైనమిది. గ్రామ సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి ప్రతి గ్రామంలో సొంత భవనాల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినా ఇక్కడ మాత్రం వైసీపీ నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం సదరు సర్పంచ్ టీడీపీ సానుభూతిపరుడు కావటమే. అధికారులు కూడా వైసీపీ నేతలకు తలూపటం వల్ల గ్రామ సచివాలయం అసంపూర్తిగా మిగిలిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తోట్లవల్లూరు, జనవరి 27: ప్రత్యేకాధికారుల పాలన ఉన్నప్పుడు ఎంతో పటిష్టంగా ఉన్న తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు పంచాయితీ కార్యాలయాన్ని పడగొట్టి అదే స్థలంలో ఉపాధిహామి నిధులు రూ 40 లక్షలతో గ్రామ సచివాలయ నిర్మాణం చేపట్టారు. గ్రామానికి చెందిన కొందరు అధికారపార్టీ వ్యక్తులు భవన నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల వరకు నిర్మాణ పనులు వేగంగా సాగినా ఫలితాల్లో టీడీపీ మద్దతుతో గ్రామ సర్పంచ్గా గెలుపొందిన మరుక్షణం నుంచి నిర్మాణ పనులను నిలిపివేశారని మూడే శివశంకర్ తెలిపారు. ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారానికి షామియానా వేసి వేదిక ఏర్పాట్లు చేయగా రోడ్డుపై టెంట్ ఉందని పోలీసులు తొలగించారన్నారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయానికి ఇంకా డోర్లు, కిటికీలు, ఫ్లోరింగ్, టైల్స్, ఎలక్ర్టికల్ పనులు, రంగులు వేయటం మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, ఇవి నెల రోజుల్లో పూర్తి చేయగలిగిన పనులైనా పూర్తిచేయటం లేదని, తాను సర్పంచ్గా ఎన్నికైన తరువాత రూ 5 లక్షల చెక్కు సదరు వ్యక్తులకు అందించటం జరిగిందని శివశంకర్ తెలిపారు. ప్రజలు తనను కలుసుకునేందుకు అవకాశం లేకుండా ఉందని, సచివాలయ నిర్మాణాన్నిపూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజూ సచివాలయ ఆవరణలోగాని, వాటర్గ్యాంకు వద్దగాని చెట్లకింద కూర్చుని వెళుతున్నానని చెప్పారు. సమావేశాలు నిర్వహించటానికి ఇబ్బందిగా మారిన ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు ఎలా సేవ చేయగలుగుతామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం: పీఆర్ ఏఈ రాఘవరావు
గ్రామ సచివాలయ నిర్మాణ పనులు నిలిచిన మాట వాస్తవమే.. వచ్చే సోమవారం లోగా ఎవరు నిర్మించాలనే విషయంపై తేల్చి సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటాం.