ఫీజు తేలక... అడ్మిషన్లు జరగక..!

ABN , First Publish Date - 2020-12-02T06:00:29+05:30 IST

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వ నాన్పుడు ధోరణి 2020-21 విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఓ పక్క ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి, తరగతుల నిర్వహణకు సిద్ధమవుతుంటే... రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, మరోపక్క డిసెంబరు నెల వచ్చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫీజు తేలక...  అడ్మిషన్లు జరగక..!

ఎంసెట్‌ ర్యాంకర్ల ఆందోళన

ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులపై  ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం 

నిలిచిపోయిన అడ్మిషన్ల ప్రక్రియ

పొరుగు రాష్ట్రంలో ఇప్పటికే పూర్తి

డీమ్స్‌ యూనివర్సిటీల్లో చేరిపోతున్నపలువురు విద్యార్థులు

సీట్ల భర్తీపై కళాశాలల యాజమాన్యాల్లో అనుమానాలు



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వ నాన్పుడు ధోరణి 2020-21 విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఓ పక్క ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి, తరగతుల నిర్వహణకు సిద్ధమవుతుంటే... రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, మరోపక్క డిసెంబరు నెల వచ్చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఎంసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందదలచిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలనను నెల రోజుల కిందట పూర్తిచేశారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇంజనీరింగ్‌తోపాటు పలు ప్రొఫెషనల్‌ కళాశాలల ఫీజులపై అధ్యయనం చేసిన ఉన్నత విద్య నియంత్రణ రెగ్యులేటరీ కమిషన్‌ తమ సిఫారసులను ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ఫీజుల వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలి. అయితే కమిషన్‌ నివేదిక అందజేసి సుమారు నెల రోజులు కావస్తున్నా..ప్రభుత్వం ఏ విషయం తేల్చకపోవడంతో అడ్మిషన్లపై అనిశ్చితి ఏర్పడింది. 


వేలాది మంది నిరీక్షణ

ఎంసెట్‌ రాసిన వేలాది మంది విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గల 25-30 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పది వేలకు పైగా సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైతే...ర్యాంకుల ఆధారంగా కాలేజీల్లో చేరేందుకు అవకాశముంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియను వాయిదా వేస్తుండడంతో ఇప్పటికే చాలామంది విద్యార్థులు డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చేరిపోయారు. మరికొంతమంది ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. వారం, పది రోజుల్లోగా ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించకపోతే...మరికొంతమంది విద్యార్థులు పొరుగు రాష్ర్టాల్లోని విద్యా సంస్థల్లో లేదా రాష్ట్రంలోని డీమ్స్‌ యూనివర్సిటీల్లో చేరిపోవచ్చునని అంటున్నారు.


కళాశాలల యాజమాన్యాల ఆందోళన

రాష్ట్రంలోని సుమారు 230 ఇంజనీరింగ్‌ కాలేజీలకు సంబంధించి మూడేళ్ల (2020-23 వరకు) బ్లాక్‌ పీరియడ్‌ ఫీజును రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసు చేసి రోజులు గడుస్తున్నా...ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించకపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్రం నుంచి వేలాది మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని, ఇంకా, ఆలస్యం చేస్తే...మరికొందరు అదేబాట పట్టే అవకాశం వుందని, అదే జరిగితే వందలాది కాలేజీల్లో సీట్లు మిగిలిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాలుగైదేళ్లుగా వందలాది కాలేజీల్లో సీట్లు సరిగా భర్తీకావడం లేదని, ప్రభుత్వం నిర్ణయం వల్ల ఈ ఏడాది మరిన్ని సీట్లు మిగిలిపోయే అవకాశం వుందని అంటున్నారు.

Updated Date - 2020-12-02T06:00:29+05:30 IST