ప్రేమను మసి చేసిన పెద్దరికం!
ABN , First Publish Date - 2022-07-04T08:35:35+05:30 IST
ప్రేమను మసి చేసిన పెద్దరికం!
సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య, పెట్రోలు పోసి నిప్పు
దారుణానికి ఒడిగట్టిన యువతి కుటుంబసభ్యులు
ప్రకాశం జిల్లాలో ఇద్దరిదీ
ఒకే ఊరు.. ఒకే సామాజిక వర్గం
యువతి తండ్రి సహా ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ సిటీ, గిద్దలూరుటౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కాదన్నా తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపం.. మరో యువకుడితో పెళ్లి చేయాలనే పంతం.. ప్రేమను మసి చేసేలా చేసింది. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం, పెళ్లి చేసుకున్న యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వివేచన మరిచిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ యువకుడి గొంతు నులిమి చంపేసి, పెట్రోలు పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. ఆ యువకుడు అదృశ్యమైన ఐదురోజుల తర్వాత ఈ విషయం వెలుగుచూసింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రం సమీపంలో 80శాతంపైగా కాలిపోయి.. కుళ్లిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకొండపల్లికి చెందిన శనివారం నారాయణరెడ్డి (26) సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే గ్రామం, తమ సామాజిక వర్గానికే చెందిన కందుల వెంకటేశ్వరరెడ్డి కూతురు రవళితో ప్రేమలోపడ్డాడు. కాగా పెళ్లికి యువతి తరఫువారు అగీకరించలేదు. వారిని కాదని గత ఏడాది ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత నారాయణరెడ్డితో మాటలు కలిపిన రవళి తల్లిదండ్రులు, కొన్నాళ్లు తమ అమ్మాయిని ఇంటికి పంపించాలని కోరారు. నమ్మిన నారాయణరెడ్డి, వారు చెప్పినట్లే భార్యను పంపాడు. ఇంటికి వచ్చిన యువతిని తల్లిదండ్రులు బంధించారు. భర్తతో మాట్లాడకుండా కట్టడి చేశారు. నారాయణ రెడ్డి ఎలాగైనా భార్యను దక్కించుకోవాలనుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మకాంను మార్చాడు. అక్కడే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చూసుకొని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో రవళి ఇంట్లో వారికి తెలియకుండా భర్తతో మాట్లాడేది. ఇది తెలిసి.. నారాయణ రెడ్డి అడ్డుతొలగించుకోవాలని రవళి తండ్రి వెంకటేశ్వరరెడ్డి నిర్ణయించాడు. అప్పటికే నారాయణ రెడ్డితో పరిచయం ఉన్న రవళికి వరుసకు సోదరుడు, తమ ఊరికే చెందిన శ్రీనివాస్ రెడ్డికి ఆ బాధ్యతను అప్పగించాడు. శ్రీనివా్సరెడ్డి తన స్నేహితులు ఆసిఫ్, కాశీతో కలిసి గత నెల 27న హైదరాబాద్లో నారాయణ రెడ్డి గదికి వచ్చాడు. మాట్లాడాలని ఆయన్ను కారులో తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత నారాయణరెడ్డి మెడకు శ్రీనివా్సరెడ్డి నైలాన్ తాడు బిగించి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో జిన్నారం మండలం నల్లూరు గ్రామ శివారులోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పటించాడు. నారాయణరెడ్డి స్నేహితుడు ఆయన కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు జూన్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్డేటా ఆధారంగా ఆసి్ఫను అదుపులోకి విచారించగా మిస్టరీ వీడింది. నిందితుల్లో వెంకటేశ్వరరెడ్డిని, శ్రీనివా్సరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.