గట్టెక్కని ప్రవాహం
ABN , First Publish Date - 2020-12-03T05:36:09+05:30 IST
బ్రిటీష్ కాలం నాటి కాల్వలు.. పిల్ల కాల్వలతో సమానంగా మారిన మేజర్ డ్రెయిన్లు.. శిథిలావస్థకు చేరుతున్న స్లూయీజ్లు, స్కవర్లు, వియ్యర్లు ఇదీ పశ్చిమ డెల్టా పరిస్థితి.
ఆధునికీకరణ ప్రతిపాదనలకే పరిమితం
పూర్తిస్థాయిలో దృష్టి పెట్టని ప్రభుత్వం
ఏళ్లు గడుస్తున్నా విడుదల కాని బిల్లులు
పనులు చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
ఏటా నష్టపోతున్న అన్నదాతలు
నిడదవోలు, డిసెంబరు 2 : బ్రిటీష్ కాలం నాటి కాల్వలు.. పిల్ల కాల్వలతో సమానంగా మారిన మేజర్ డ్రెయిన్లు.. శిథిలావస్థకు చేరుతున్న స్లూయీజ్లు, స్కవర్లు, వియ్యర్లు ఇదీ పశ్చిమ డెల్టా పరిస్థితి. ఫలితంగా గోదావరి పక్క నుంచి పారుతున్నా సాగునీరు అందక ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. అంతేకాదు.. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు మురుగునీరు పారక పొలాలన్నీ ముంపునకు గురై కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. వీటన్నిం టిని దృష్టిలో పెట్టుకుని.. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా డెల్టా ఆధునికీక రణ ఒక్కటే మార్గమని నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు నిర్ణయించారు. ఈ పనులు చేపడితే రైతాంగం ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ ఏటికేడాది ఈ పనులకు నిధులు విడుదల కాక జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది పనులు జరిపే పరిస్థితి కనిపించడం లేదు. ఆధునికీకరణ కలగానే మిగిలేలా ఉంది.
పశ్చిమ డెల్టా పరిధిలో నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు ఆయకట్టు సాగవుతోంది. శివారు ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో అవ స్థలు పడుతున్నారు. బ్రిటీషర్ల కాలంలో తవ్విన కాలువలు, నిర్మించిన స్లూయీ జ్లు, స్క్లవర్లు, వియ్యర్లే నేటికి వినియోగంలో ఉన్నాయి. శివారు ప్రాంతానికి నీరు సమృద్ధిగా వెళ్లకపోవడంతో ఏటా రబీలో నీటి సమస్య తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగా 2007 నవంబరు 29న అప్పటి ప్రభుత్వ హయాంలో జీవో నం. ఎంఎస్ 258 ద్వారా పశ్చిమ డెల్టాకు రూ.1,200 కోట్లతో ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. స్లూయీజ్లు, వియ్యర్లు పునర్నిర్మాణం, లాకులు, కాలువ గట్లు పటిష్ట పరిచేందుకు పనులు చేయాలి. అప్పుడు కేటాయించిన బడ్జెట్లో సగం కూడా నేటికీ ఉపయోగించుకుని పనులను పూర్తిచేసిన దాఖలాలు లేవు. తిరిగి ఈ ఏడాది 188 పనులకు రూ.178 కోట్లతో పనులు చేసేలా జలవనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి అనుమతు లు మంజూరు కాలేదు. 2019–20 సంవత్స రానికి సంబంధించి సుమారు రూ.13 కోట్లతో 175 పనులకు అనుమతులు పంపినా అనుమతులు రాకపోవ డంతో ఆధునికీకరణ జరగలేదు.
రూ.14.44 కోట్ల బకాయిలు
పనులకు అనుమతులు లభించి, టెండర్ల ప్రక్రియ పూర్త య్యే సమయా నికి ఉన్న సమయం హరించుకుపోతుంది. మూడేళ్లుగా చేసిన పనులకు కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు మంజూరు కాకపోవడంతో కొత్తగా ఎవరూ ముందుకు రావడం లేదు. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి చేపట్టిన ఆధునికీకరణ పనులకు కాంట్రాక్టర్లకు సుమారు పధ్నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం బకాయి పడడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. మూడేళ్ల బిల్లులు నేటికి తమకు క్లియర్ కాకపోవడంతో కాంట్రాక్టర్లు జలవనరుల శాఖ పనులంటేనే బెంబేలెత్తుతున్నారు.
ప్రతిపాదనలతోనే సరి..
పశ్చిమ డెల్టా పరిధిలోని ఆధునికీకరణ పనులకు సంబంధించి 28 మండలాల్లో పనులు చేపట్టాలి. జలవనరుల శాఖ అధికారులు ఏటా ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మంజూరైన పనులు వేగవంతంగా జరిగేలా చూడడం గాని, జరిగే పనులలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం గాని జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతాంగం విమర్శ. ప్రతిపాద నలు బిల్లులపై మాత్రమే జలవనురుల శాఖ దృష్టంతా అనేది రైతాంగం విమర్శ. ఈ ఏడాది పనులు గాడి తప్పి రైతాంగానికి శాపంగానే మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
సంవత్సరం అనుమతులు పూర్తి చేసిన ఖర్చు చేసిన
లభించిన బడ్జెట్ పనుల సంఖ్య బడ్జెట్
2015–16 రూ.176.44 కోట్లు 30 రూ.48.46 కోట్లు
2016–17 రూ.130.86 కోట్లు 84 రూ.33.21 కోట్లు
2017–18 రూ.9.14 కోట్లు 34 రూ.28.44 కోట్లు
2018–19 రూ.105.91 కోట్లు 34 రూ.39.71 కోట్లు
2019–20 రూ.12.61 కోట్లు ––– –––
2020–21 118 పనులకు రూ.178 కోట్లతో ప్రతిపాదనలు