ఆ దేశంలో ఘోర పేదరికం.. పిల్లలకు తిండి పెట్టలేక కిడ్నీలు అమ్ముకుంటున్న తండ్రులు

ABN , First Publish Date - 2022-01-17T08:21:43+05:30 IST

అధికారం కోసం జరిగిన పోరాటంలో అమాయకులు బలి అవుతారనే దానికి తాజా నిదర్శన ఆప్ఘనిస్తాన్. అక్కడ తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. వారి పాలనలో ఆఫ్ఘన్ల పరిస్థితి దయనీయంగా మారింది...

ఆ దేశంలో ఘోర పేదరికం.. పిల్లలకు తిండి పెట్టలేక కిడ్నీలు అమ్ముకుంటున్న తండ్రులు

అధికారం కోసం జరిగిన పోరాటంలో అమాయకులు బలి అవుతారనే దానికి తాజా నిదర్శన ఆప్ఘనిస్తాన్. అక్కడ తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. వారి పాలనలో ఆఫ్ఘన్ల పరిస్థితి దయనీయంగా మారింది. 


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో తినేందుకు తిండి లేక, చేసేందుకు పనిలేక.. సాధారణ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తండ్రులు దిక్కుతోచని స్థితిలో తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో కిడ్నీల అమ్మకాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవలే తన కిడ్నీని విక్రయించిన గులాం హజ్రత్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా Kidney ని రూ. 69 లక్షలకు అమ్మేశాను. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైన తిండి పెడతాను’ అని చెప్పాడు. 


గులాం హజ్రత్ తరహాలోనే ఆ దేశంలో చాలామంది తండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. హెరాత్  ప్రావిన్స్‌లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకు వస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు.


కిడ్నీ దాత, కొనుగోలుదారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందని వైద్యలు చెబుతున్నారు. కిడ్నీని కోల్పోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కంటే వారి కుటుంబ పోషణకే ఆఫ్ఘనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వైద్యులు చెప్పారు. కిడ్నీని ఇచ్చేశాక.. కనీసం ఏడాది పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. రెండు నెలలకే దొరికిన పనికి వెళ్ళిపోతున్నారు. 


చాలామంది ప్రాణభయంతో ఇప్పటికే దేశం విడిచి వెళ్లారని..  వారిలో కొందరిని ఆయా దేశాలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపాయని స్థానిక మత పెద్ద చెప్పారు.  దేశం విడిచి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న అప్పులు తీర్చేందుకు కూడా చాలామంది కిడ్నీలు  అమ్ముతున్నారని వివరించారు.


ప్రపంచ దేశాలన్నీ ఆదుకోవాలి : ఐక్యరాజ్యసమితి

ఆప్ఘనిస్తాన్‌లో ఆకలి సునామీ రాబోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్ పీ) గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలు  పక్కన పెట్టి  తక్షణమే  మానవతా  సాయం అందించాలని ఐక్యరాజ్యసమితి అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రస్తుతం 2.78 కోట్ల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని, ఇందులో  87 లక్షల మంది ఆకలి చావులకు చేరువలో ఉన్నారని వారు తెలిపారు.


ఆకలి తీర్చేందుకు తమకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చే 12 నెలలపాటు పూర్తిస్థాయిలో మానవతా సాయం కొనసాగించేందుకు కనీసం 4.4 బిలియన్ డాలర్లు కావాలన్నారు. ఆహార పంపిణీ కనీస స్థాయిలో చేపట్టాలన్నా 2.6 బిలియన్ డాలర్లు అవసరమని చెప్పారు. 


Updated Date - 2022-01-17T08:21:43+05:30 IST