చైనా అక్రమ వంతెనను మోదీ ప్రారంభిస్తారేమోనని భయంగా ఉంది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-01-19T23:05:29+05:30 IST

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పాంగాంగ్ సో సరస్సు తీరంలో,

చైనా అక్రమ వంతెనను మోదీ ప్రారంభిస్తారేమోనని భయంగా ఉంది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పాంగాంగ్ సో సరస్సు తీరంలో, భారత భూభాగంలో ఓ వంతెనను చైనా సైన్యం (పీఎల్ఏ) అక్రమంగా నిర్మిస్తోందని, దీనిని ప్రారంభించేందుకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్తారేమోనని భయంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వంతెన నిర్మాణంపై ప్రధాన మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని జనవరి 4న కూడా రాహుల్ ప్రశ్నించారు. 


రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మన దేశంలో చైనా చట్టవిరుద్ధంగా ఓ వంతెనను నిర్మిస్తోంది. ప్రధాన మంత్రి మౌనం వల్ల పీఎల్ఏ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇప్పుడున్న భయం ఏమిటంటే, ఈ వంతెనను ప్రారంభించేందుకు కూడా పీఎం వెళ్ళరు కదా అనేదే’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తోపాటు ఓ వీడియోను షేర్ చేశారు. 


పాంగాంగ్ సో సరస్సుపై వంతెన నిర్మాణం వల్ల చైనా దళాలు సులువుగా ప్రయాణించగలుగుతాయి. 8 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. పాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరంలో, చైనా ఆర్మీ ఫీల్డ్‌కు దక్షిణ దిశలో ఈ వంతెన ఉన్నట్లు తెలిపింది. 2020లో ఇరు దేశాల దళాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినపుడు ఈ ప్రాంతంలో చైనా దళాలకు ఆసుపత్రులు, వసతి సదుపాయాలు ఉన్నట్లు తెలిసింది. 


తూర్పు లడఖ్‌ వెంబడి సరిహద్దుల్లో పరిస్థితులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కదిద్ద లేకపోతోందని కాంగ్రెస్, రాహుల్ గాందీ తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.




Updated Date - 2022-01-19T23:05:29+05:30 IST