Heavy rains: 113 ఏళ్ల తర్వాత ఆగస్టులో అధిక వర్షపాతం
ABN , First Publish Date - 2022-09-03T13:18:28+05:30 IST
రాష్ట్రంలో 113 ఏళ్ల అనంతరం ఆగస్టులో 93 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్ర దక్షిణ మండల డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు.
- వాతావరణ కేంద్ర డైరెక్టర్ బాలచంద్రన్
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 2: రాష్ట్రంలో 113 ఏళ్ల అనంతరం ఆగస్టులో 93 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్ర దక్షిణ మండల డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు. నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరునల్వేలి, నామక్కల్, ధర్మపురి, ఈరోడ్, తిరుప్పూర్, విరుదునగర్, శివగంగ(Tirunalveli, Namakkal, Dharmapuri, Erode, Tiruppur, Virudhunagar, Sivaganga) సహా 18 జిల్లాల్లో నైరుతు రుతుపవనాల సీజన్లో 100 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. గత జూన్ నుంచి ఆగస్టు వరకు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలతో సరాసరిన 40 సెం.మీ వర్షపాతం నమోదైందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 88 శాతం అధికమని తెలిపారు. గడిచిన 122 ఏళ్లలో మూడోసారి అధిక వర్షం కురిసిందన్నారు. 1906లో 112 సెం.మీ వర్షం, 1909వ సంవత్సరంలో 127 సెం.మీ, 2022లో 93 సెం.మీ వర్షపాతం కురిసిందని, తదుపరి 113 ఏళ్ల తర్వాత అధిక వర్షపాతం నమోదైందని బాలచంద్రన్ తెలిపారు.