పెళ్లయిన 6 నెలలకే కొడుకు మృతి.. కోడలి విషయంలో ఆ అత్తమామలు తీసుకున్న నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-01-24T20:20:34+05:30 IST

పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఆమెను దురదృష్టం వెంటాడింది. ఏడాది కూడా గడవకముందే భర్తను కోల్పోయింది.

పెళ్లయిన 6 నెలలకే కొడుకు మృతి.. కోడలి విషయంలో ఆ అత్తమామలు తీసుకున్న నిర్ణయమిదీ..!

పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఆమెను దురదృష్టం వెంటాడింది. ఏడాది కూడా గడవకముందే భర్తను కోల్పోయింది. అయితే అత్తమామలు ఆమెకు అండగా నిలిచారు. కొడుకే లేనపుడు.. కోడలు ఎందుకని ఆమెను వదిలేయలేదు. కన్న కూతురిలా చూసుకున్నారు. ఆమెను చదివించారు. మంచి ఉద్యోగం తెచ్చుకునేలా ప్రోత్సహించారు. అనంతరం మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కోడలి విషయంలో ఆ వృద్ధ దంపతులు చూపిన ఆదరణ ప్రశంసలు అందుకుంటోంది. 


రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన కమలా దేవి, దిలావర్ దంపతుల కుమారుడు శుభమ్‌కు 2016లో సునీత అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరు నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుభమ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సునీత ఒంటరి అయిపోయింది. పేద కుటుంబానికి చెందిన సునీతను కమలా దేవి దంపతులు వదులుకోలేదు. ఆమెను తమ దగ్గరే ఉంచుకుని చదివించారు. అత్తమామల ప్రోత్సాహంతో సునీత ఎమ్.ఎ.బీ.ఈడీ చదవింది. పోటీ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్‌గా కూడా ఎంపికైంది. 


సునీత్ జీవితంలో స్థిరపడడంతో ఆమెకు మళ్లీ పెళ్లి చెయ్యాలని కమలా దేవి, దిలావర్ నిర్ణయించుకున్నారు. వరుడి కోసం అన్వేషణ ప్రారంభించి ఆడిటర్ ముఖేష్‌తో సునీతకు పెళ్లి నిర్ణయించారు. గత శనివారం దగ్గరుండి వారి పెళ్లి జరిపించారు. అత్తమామలను విడిచి వెళ్లేటపుడు సునీత కన్నీళ్లు పెట్టుకుంది. కోడలి పట్ల ఎంతో ఆదరణ చూపించిన కమలా దేవి, దిలావర్ దంపతులపై బంధుమిత్రులు ప్రశంసలు కురిపించారు. 

Updated Date - 2022-01-24T20:20:34+05:30 IST