Biharలో సొంతంగా Caste Census: Nitish Kumar
ABN , First Publish Date - 2022-06-02T02:35:43+05:30 IST
దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణనకు సిద్ధంగా లేమని కేంద్ర స్పష్టం చేసినందున తాము సొంతంగానే బీహార్లో ..
పాట్నా: దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణనకు (Caste Census) సిద్ధంగా లేమని కేంద్ర స్పష్టం చేసినందున తాము సొంతంగానే బీహార్లో కులాల వారిగా జనాభా గణనను చేపట్టనున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రకటించారు. ఈ విషయమై బుధవారంనాడు అఖిలపక్ష సమావేశాన్ని సీఎం ఏర్పాటు చేశారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని నితీష్ కుమార్ ప్రకటించారు. సమావేశంలో పాల్గొన్న 9 పార్టీలు కుల గణన చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. త్వరలోనే క్యాబినెట్ ఆమోదం తీసుకుని, ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని అన్నారు. అడ్వర్టైజ్మెంట్ కూడా జారీ చేసి నిర్ధారిత గడువులోగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
బీజేపీతో సహా బీహార్లోని అన్ని పార్టీలు ప్రధానమంత్రిని గత ఏడాది కలిసి దేశవ్యాప్త కుల ఆధారిత జనాభా గణనను చేపట్టాలని కోరామని నితీష్ తెలిపారు. ''ఇప్పుడు కేంద్రం కూడా చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. దేశవ్యాప్త కులగణన చేపట్టడం లేదని చెప్పింది. దాంతో మేము సొంతంగా రాష్ట్ర జనాభా గణనకు నిర్ణయించాం. పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి'' అని నితీష్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రెండున్నర నెలల పట్టినందునే కుల గణన అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగిదని అన్నారు.
మా చిరకాల డిమాండ్ ఇది: తేజస్వి
కుల ఆధారిత జనాభా గణనకు తాము చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. దేశవ్యాప్త కుల గణన చేపడితే బాగుండేదని, అయినప్పటికీ బీహార్ సొంతంగా కుల గణన చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడంతో సంతృప్తి చెందుతున్నామని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో తేజస్వితో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైశ్వాల్, ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఎంఐఎం బీహార్ యూనిట్ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ తదితరులు పాల్గొన్నారు.