ఛానెల్ మార్చమని అక్కతో గొడవ.. ఆమె వినడం లేదని క్షణికావేశంలో ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2021-07-21T17:54:28+05:30 IST
టీవీలో తమకు నచ్చిన ఛానెల్ చూస్తామని ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల మధ్య సాధారణంగా గొడవలు వస్తుంటాయి.
టీవీలో తమకు నచ్చిన ఛానెల్ చూస్తామని ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల మధ్య సాధారణంగా గొడవలు వస్తుంటాయి. అలాంటి సమయాల్లో పెద్దలు కల్పించుకుని సర్ది చెబుతారు. లేదా పిల్లలే వారిలో వారు రాజీ పడతారు. అయితే కేరళలోని ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. తనకు నచ్చిన ఛానెల్ పెట్టమని అక్కతో గొడవపడి.. ఆమె వినకపోవడంతో ఉరేసుకుని చనిపోయింది.
గత సోమవారం ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల బాలిక తన అక్క, కజిన్తో కలిసి టీవీ చూస్తోంది. ఆ సమయంలో వేరే ఛానెల్ పెడతానంటూ అక్క దగ్గర్నుంచి రిమోట్ లాక్కొని ఛానెల్ మార్చింది. అనంతరం బాలిక అక్క తన దగ్గర్నుంచి రిమోట్ లాక్కుని మళ్లీ ఛానెల్ మార్చింది. దీంతో అక్కతో గొడవపడిన చెల్లి బెడ్రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. గదిలోకి వెళ్లిన బాలిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానమొచ్చిన ఆమె నానమ్మ కిటికీలో నుంచి చూసింది. అప్పటికే ఆ బాలిక కిటికీ గ్రిల్స్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి బాలికను కిందకు దింపారు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.