Gorantla Madhav: ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న గోరంట్ల మాధవ్ యవ్వారం.. #YcpMpDirtyPicture హ్యాష్ట్యాగ్ వైరల్..
ABN , First Publish Date - 2022-08-06T01:29:59+05:30 IST
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ (Gorantla Madhav Video Call) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా..
అనంతపురం: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ (Gorantla Madhav Video Call) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. దేశ వ్యాప్తంగా #YcpMpDirtyPicture అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 30 వేలకు పైగా ఈ హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేశారు. గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెటిజన్ల ట్విట్టర్లో డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం మాధవ్ వ్యవహారంపై తాత్సారం వహిస్తుండటంతో జగన్పై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల మాధవ్ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయమే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ‘వైరల్’గా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఇది గురువారం ఉదయమే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇది జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. జాతీయ చానళ్లలో కూడా గోరంట్ల ‘నగ్న’ కథనాలు ప్రసారమయ్యాయి.
వివాదాల చరిత్ర..
ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. 1998లో ఆయన ఎస్ఐగా ఉద్యోగంలో చేరారు. కడప జిల్లాలో ఐదేళ్లు పని చేశారు. అప్పట్లో వ్యక్తిగత ఆరోపణలు రావడంతో ఆయనను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది... అనంతపురం, కదిరిలో పని చేశారు. ‘సినిమా స్టైల్ పోలీస్’గా పేరు తెచ్చుకోవడానికి ఆరాటపడే వారు. నాలుగు రోడ్ల కూడళ్లలో అందరూ చూస్తుండగానే లాఠీ ఝుళిపించడం ఆయన స్టైల్! గోరంట్ల మాధవ్ పగలు జనాల్లో పేరు కోసం హడావుడి చేస్తూ... రాత్రిళ్లు సెటిల్మెంట్లలో తలమునకలవుతారని చెబుతారు. ప్రధానంగా భూసమస్యలు, భార్యాభర్తల మధ్య తగాదాలు తీర్చడంపై దృష్టి సారించేవారు. నగలు, వస్త్ర దుకాణాలకు వెళ్లి నచ్చినవి తీసుకోవడం... డబ్బులు ఇవ్వకుండా వచ్చేయడం కూడా ఆయన శైలి అని చెబుతారు.
కదిరి సీఐగా పనిచేసినపుడే గోరంట్ల మాధవ్పై ‘రాసలీల’ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంపీ అయిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ఒక మహిళతో వివాదం ముదరడంతో తన బ్యాచ్కే చెందిన ఒక సీఐ సహకారంతో... ‘సెటిల్’ చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో ఆయనను వేకెన్సీ రిజర్వ్కు పంపించారు. నోట్ల రద్దు సమయంలో అనంతపురంలో బ్యాంకు వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విచక్షణారహితంగా కొట్టి సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డిపై మీసాలు దువ్వి సవాలు విసిరిన గోరంట్ల.. వైసీపీ దృష్టిని ఆకర్షించారు. ఎంపీ టికెట్ పొందారు.