కోరుకున్న వ్యక్తితోనే పెళ్లి నిశ్చయమైంది.. ముహూర్తం కూడా పెట్టుకున్న తర్వాత యువతి అంత ఘోరానికి ఎందుకు పాల్పడిందంటే..

ABN , First Publish Date - 2021-12-01T23:06:22+05:30 IST

ఇంటర్మీడియెట్ చదువుకున్న ఆ యువతి తన పొరుగింటి వ్యక్తితో ప్రేమలో పడింది..

కోరుకున్న వ్యక్తితోనే పెళ్లి నిశ్చయమైంది.. ముహూర్తం కూడా పెట్టుకున్న తర్వాత యువతి అంత ఘోరానికి ఎందుకు పాల్పడిందంటే..

ఇంటర్మీడియెట్ చదువుకున్న ఆ యువతి తన పొరుగింటి వ్యక్తితో ప్రేమలో పడింది.. పెద్దలు అంగీకరించడంతో ఇద్దరికీ పెళ్లి కూడా కుదిరింది.. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.. ఆ తరుణంలో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.. యువకుడి నుంచి వచ్చిన ఒత్తిడులే ఆత్మహత్యకు కారణమని ఆ యువతి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝన్సీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ఝాన్సీ జిల్లాలోని బమేర్ గ్రామానికి చెందిన దేవి ప్రసాద్ కూతురు కాజల్ గతేడాది ఇంటర్ పూర్తి చేసింది. తన క్లాస్‌మేట్, ఎదురింట్లో ఉండే వ్యక్తితో ప్రేమలో పడింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలిపారు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత వరుడు రూ.5 లక్షలు కట్నం అడిగాడు. పేదవాడైన దేవి ప్రసాద్ అంత కట్నం ఇవ్వలేనని తేల్చిచెప్పాడు. దీంతో కాజల్‌ను ఆమె ప్రేమికుడు వేధించడం మొదలుపెట్టాడు. 


కట్నం ఇవ్వలేరని తేలడంతో అతను పెళ్లి రద్దు చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన కాజల్ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమికుడి వేధింపుల వలనే కాజల్ ఆత్మహత్య చేసుకుందని కంప్లైంట్ ఇచ్చారు. కాజల్ ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలుసుకున్న ప్రియుడి కుటుంబం ఊరి నుంచి పరారైంది. 

Updated Date - 2021-12-01T23:06:22+05:30 IST