అనుమతులు పొందిన తర్వాతే ఓజిలిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్ ఏర్పాటు: AG&P Pratham

ABN , First Publish Date - 2022-07-11T23:06:20+05:30 IST

జిల్లాలోని ఓజిలి మండలం పెద్దపరియ క్రాస్ సమీపంలో చెరువులకు అతి సమీపంలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటు

అనుమతులు పొందిన తర్వాతే ఓజిలిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్ ఏర్పాటు: AG&P Pratham

నెల్లూరు: జిల్లాలోని ఓజిలి మండలం పెద్దపరియ క్రాస్ సమీపంలో చెరువులకు అతి సమీపంలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోందంటూ వస్తున్న విమర్శలపై ఏజీ అండ్ పి ప్రథమ్ (AG&P Pratham) స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని, అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణ పనులు ప్రారంభించినట్టు పేర్కొంది. పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌, బాయిలర్స్‌, ఫ్యాక్టరీస్‌ (డిష్‌), ద ఫైర్‌ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ (ఫైర్‌ ఎన్‌ఓసీ), నెల్లూరు నగరాభివృద్ధి సంస్ధ (నుడా), అపెక్స్‌ సేఫ్టీ స్టాట్యుటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్టు వివరించింది. 


ఎన్‌సీఎన్‌జీ స్టేషన్‌ ఏర్పాటు కోసం పై సంస్థల నుంచి అవసరమైన అనుమతులు, ఆమోదం లభించిన తర్వాత నిర్మాణం ప్రారంభించినట్టు పేర్కొంది. కాగా, ఏజీ అండ్ పి ప్రథమ్ చెరువులకు అతి సమీపంలో నిర్మాణాలు చేపడుతోందంటూ వాకాటివారి కండ్రిగ గ్రామానికి చెందిన 10 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇటీవల సూళ్లూరుపేట ఆర్‌డీవో, ల్యాండ్‌  అండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు ఓజ్లీలోని ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి భూమి కొలతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజీ అండ్ పి ప్రథమ్ ఈ ప్రకటన విడుదల చేసింది. చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని,  సస్టెయినబల్‌ గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొంది.  కాగా, ఏజీ అండ్ పి ప్రథమ్‌కు 12 సీజీడీ లైసెన్సులను పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ మండలి (PNGRB) మంజూరు చేసింది.  వీటి ద్వారా దేశవ్యాప్తంగా 34 జిల్లాల్లో ప్రతి రోజూ గ్యాస్‌ను అందిస్తోంది.

Updated Date - 2022-07-11T23:06:20+05:30 IST