మళ్లీ దంచుతోంది!

ABN , First Publish Date - 2022-05-15T06:52:52+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

మళ్లీ దంచుతోంది!
అమలాపురంలో జనసంచారం లేక వెలవెలబోతున్న మెయిన్‌రోడ్‌

  • భానుడి భగభగలు.. అల్లాడుతున్న ప్రజలు
  • తీరం వెంబడి పెరిగిన వేడిగాలుల తీవ్రత
  • నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు
  • మొదలైన అనధికార కరెంటు కోతలు

మళ్లీ వేసవి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. శనివారం ఉదయం పదకొండు గంటల నుంచే ఎండలు దంచేశాయి. మధ్యాహ్నం వేళ రోడ్ల మీద జన సంచారం లేదు. చాలా దుకాణాలు మూసివేసి సాయంత్రం తెరిచారు. ఉక్కపోత కూడా పెరిగిపోయింది. అసాని తుఫాన్‌తో విద్యుత్‌ వాడకం వారంరోజులు లేదు. దీంతో కోతలు తగ్గాయి. అయితే ఎండల తీవ్రత వల్ల విద్యుత్‌ వినియోగం పెరగడంతో ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు మళ్లీ అనధికార కోతలకు తెరదీశారు.

అమలాపురం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అసాని తుఫాన్‌ తర్వాత ఎండల తీవ్రత పెరి గింది. తుఫాన్‌ సమయంలో కోనసీమ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రం గానే కురిశాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు ప్రజలకు ఇబ్బంది కరంగా మారాయి. సముద్ర తీరం వెంబడి గ్రామాలతో సహా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత అనూహ్యంగా పెరిగిపోతుండడంతో ప్రజలు రోడ్లపైకి రాని పరిస్థితి ఏర్పడింది. తీరం వెంబడి వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలో 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. వివాహాది శుభ కార్యక్ర మాలు ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు విద్యుత్‌ కోతలతో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. కాల్వలకు నీటిని నిలిపి వేయడంతో పశుపక్ష్యాదులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. అమలాపురం పట్టణంతోపాటు ఒకటి రెండుచోట్ల స్వచ్ఛంద సంస్థలు చలి వేంద్రాలు ఏర్పాటుచేసి తాగునీరు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎక్క డా కూడా తాగునీరు, మజ్జిగ వంటి కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. వాతా వరణశాఖ హెచ్చరికల ప్రకారం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా వడదెబ్బకు గురికాకుండా అవస రమైన జాగ్రత్తలు వహించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. రాజస్థాన్‌ వంటి రాష్ర్టాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఇతర రాష్ర్టాలతో పాటు ఏపీలోని ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రతతో రెండు రోజుల నుంచి అమలాపురంతోపాటు కోనసీమవ్యాప్తంగా పలుచోట్ల వర్తక, వాణిజ్య, వ్యాపా ర సంస్థలు అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో ప్రయాణికుల రాకపోకలు లేక రహదారులు వెలవెలబోతున్నాయి.

Updated Date - 2022-05-15T06:52:52+05:30 IST