ఇక, దిద్దుబాటే శ్రీరామరక్ష !

ABN , First Publish Date - 2021-06-23T05:41:46+05:30 IST

నాయకుల జీవితాల్లో పోరాటకాలం, పదవీ కాలం, పోకదల కాలం- అనే మూడు ముఖ్య మజిలీలు ఉంటాయి. పదవీభాగ్యం దక్కే స్థాయికి చేరాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది...

ఇక, దిద్దుబాటే శ్రీరామరక్ష !

నాయకుల జీవితాల్లో పోరాటకాలం, పదవీ కాలం, పోకదల కాలం- అనే మూడు ముఖ్య మజిలీలు ఉంటాయి. పదవీభాగ్యం దక్కే స్థాయికి చేరాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఆశించిన ఫలితం రాక కనుమరుగయ్యేవారే తొంభై ఐదు శాతం మంది ఉంటారీ రాజకీయ వైకుంఠపాళిలో. మిగిలిన ఐదు శాతంలో నాలుగున్నర శాతం మంది పదవి పొందాక పవర్ కిక్కులో తిక్కతిక్క నిర్ణయాలు తీసుకుంటూ, అధికారాన్ని అజరామరం చేసుకోవడమే పాలనకన్నా ముఖ్యమైన పనని నమ్మి కాలగర్భంలో కలిసిపోతారు. ఆ చివరి అరశాతం మంది, విశేష ప్రజాభిమానంతో పదవి పొందాక కూడా... సింహాసనం అశాశ్వతమైనదని అనుక్షణం గుర్తెరిగి ప్రజారంజకంగా పాలించి చరిత్రలో నిలిచిపోతారు.


కష్టపడి సాధించుకున్న అధికారానికి దూరమయ్యే కాలాన్నే నాజూగ్గా పోకదల కాలం అంటారు. నేతల జీవితాల్లో చివరిదైన ఈ ఘట్టంలో ఐదు దశలు ఉంటాయి. ఇది దాపురిస్తున్న మొదటి దశలో- అందలం ఎక్కించిన ప్రజాబలాన్ని నాయకుడు తప్పుగా అవగాహన చేసుకుంటాడు. రెండో దశలో- అంతవరకూ చోదక శక్తిగా నడిపిన సిద్ధాంతాన్ని త్యజిస్తాడు. మూడో దశలో- కొత్త భజనపరులు చుట్టూ చేరి రంజింపజేస్తుండగా అనుయాయులపై అపనమ్మకం పెరిగి శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా అనిపిస్తారు. నాలుగో దశలో- సంస్థాగతమైన వ్యవస్థలు పనికిమాలినవిగా తోచి, నా మాటే శాసనమన్న విశ్వాసం దృఢపడుతుంది. అడ్డు అనుకున్నవారిని తొక్కిపారేసే ఉన్మాదం ఆవరిస్తుంది. ఐదో దశలో- ఒకవైపు అంతఃశక్తి తాను మామూలు మనిషిని కాననీ, ఒక అద్భుత అతీంద్రియ శక్తినని క్షణక్షణం బోధిస్తుండగా, మరోపక్క అప్పటికే బలపడిన కోటరీ వినిపించే బాజాభజంత్రీల ఆస్వాదనలో మునిగితేలుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ నాయకుడు పతనమై పోతాడు.


అద్భుతమైన నాయకత్వం, వాక్ చాతుర్యం, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా రెండోసారి పాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వ్యవహార శైలి, పాలనాధోరణి, నిర్ణయాలు చూస్తుంటే పైన పేర్కొన్న నాలుగో దశలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తున్నది. ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడంలో ఆయన చేసిన జాప్యం మొదటి దశకు సూచిక. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనుమరుగుకావడం రెండోదశలో కనిపిస్తే, తనకన్నా ఒకింత ఎక్కువగానే తెలంగాణ వాదాన్ని వినిపించి, జనసమీకరణలో కీలక భూమిక పోషించిన వారిని పక్కనపెట్టి, ఉద్యమ వ్యతిరేకులను ఆదరించి అందలాలు ఎక్కించడం, స్వేచ్ఛగా ఉండాల్సిన మీడియాపై పట్టుబిగించడం వంటి పనులు మూడో దశలో భాగంగా కనిపిస్తాయి. 


కేసీఆర్ ప్రజా సంక్షేమాన్నేమీ మరువలేదు. రైతుల ఖాతాల్లో ఎప్పుడూ లేనివిధంగా డబ్బులు జమవుతున్నాయి. అన్ని వర్గాల వారికీ జీవాలు, చేపపిల్లలు, ఇతరత్రా సాయాలు అందే ఏర్పాటు జరిగింది. జనాలకు చేపలిచ్చి ఖుషీగా ఉంచాలా? చేపలు పట్టే పరిస్థితులు కల్పించాలా? అన్న ‘అభివృద్ధి చర్చ’ మొదలయ్యేలోపే భారీగా సాగునీరు అందించే ప్రాజెక్టులు మొదలయ్యాయి. కొవిడ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినా ఉద్యోగులకు జీతాలూ పెంచారు. అలాగే, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణావసర మందుల కోసం జనాలు హాహాకారాలు చేయాల్సిరాగా, ఇదే అదనుగా కొన్ని ప్రయివేటు-కార్పొరేటు ఆసుపత్రుల వైద్యం లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం అప్పుల్జేసి ఆస్తులు అమ్ముకుని బికార్లవుతుంటే, ఖజానా ఖాళీ అయి రుణభారంతో ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.


కొవిడ్ రెండో తరంగం సమాంతరంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే- కేసీఆర్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమవుతుంది. ఈటల రాజేందర్‌ను సమయం సందర్భం చూసుకోకుండా ఆరోగ్యమంత్రి పదవి నుంచి తీసిపారెయ్యడం ఆ నిర్ణయాల్లో చిన్నది మాత్రమే. భారీ అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు దాదాపుగా అందరిమీదా ఉన్నా ఒక్కడ్ని టార్గెట్ చేయడం అభ్యంతరకరమే. నిజానికి, ఈటల ఉదంతంకన్నా ప్రభుత్వానికి పెద్ద నష్టం కలిగించిన పరిణామాలు రెండున్నాయి. దుబ్బాకలో దెబ్బ, గ్రేటర్ హైదరాబాద్‌లో కమల వికాసం కన్నా కూడా ఈ రెండు పరిణామాలు ముంచుకొస్తున్న ఆ నాలుగో దశను బలంగా సూచిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఇద్దరు సాహసవంతులైన నవతరం జర్నలిస్టులు ఉండడం విశేషం. వారిద్దరూ ప్రభుత్వ ఇనుప పిడికిలికి దూరంగా సోషల్ మీడియాను ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇందుకు ఆద్యుడు- తీన్మార్ మల్లన్న అనే నవీన్. పోలీసు కేసులకు జంకకుండా, ధైర్యంతో అవినీతి బాగోతాలను మల్లన్న రోజువారీ ప్రజల ముందుంచే పనిలో ఉన్నాడు. దూషణ మోతాదు ఎక్కువని అనిపించినా మల్లన్న తీన్మార్ పల్లెపల్లెకూ చేరి విశేష ప్రభావం చూపింది. ఖమ్మం–-వరంగల్–-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న నైతిక విజయం సాధించాడు.


సర్కార్ చేసుకున్న ‘సెల్ఫ్ గోల్’... యువ జర్నలిస్టు గంజి రఘు అరెస్టు. కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలను వెలికితీస్తున్న రఘును పట్టపగలు రాష్ట్ర రాజధానిలో మఫ్టీ పోలీసులు చేసిన దౌర్జన్యపూరిత అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. జైలు నుంచి వీరుడిగా తిరిగి వచ్చిన రఘుకు లభిస్తున్న విశేష స్పందన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. పోలీసు జులుం ఢిల్లీ స్థాయిలోనే కాదు, విశ్వవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరువు తీసింది-సోషల్ మీడియా సాక్షిగా.


మీడియా సంస్థలను నియంత్రించి ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకుందామంటే కుదిరే కాలం కాదిది. కారణం, అత్యంత ప్రభావశీలమైన సోషల్ మీడియా అనూహ్య విస్తరణ. దేన్నైనా క్షణాల్లో వైరల్ చేసే సామాజిక మాధ్యమాలు ఒకపక్క, కొత్త ప్రజాస్వామ్య గళాలు -క్రియాశీలంగా ఉన్న న్యాయవ్యవస్థ మరొక పక్క ‘అణచివేతతో ఏదైనా సాధ్యం’ అన్న నిరంకుశ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రభుత్వాల తిక్క కుదురుస్తున్నాయిప్పుడు. చేతిలో ఉన్న మొబైల్‌ను బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోవచ్చో, దురహంకార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జన శ్రేణులను సమీకరించి ఎలా బుద్ధిచెప్పవచ్చో ‘అరబ్ స్ప్రింగ్’ పదేళ్ల కిందటే నేర్పింది. ఈ విద్య మన బిడ్డలకూ బాగా అబ్బింది. దొంగ కేసులు-–దౌర్జన్యపూరిత అరెస్టులతో ప్రపంచవ్యాప్తంగా బద్నామ్ అవుతామని పైవారికి నచ్చజెప్పి, నెటిజన్స్‌ను సాకుగా చూపి తప్పించుకోవడం పోలీస్ అధికారులకు ఇపుడు శ్రేయస్కరం.


రాష్ట్రం విషయంలో అనుకున్నదొక్కటి... అయ్యిందొక్కటని ప్రొఫెసర్లు, టీచర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఇతర బుద్ధిజీవులు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి అణచివేత, క్రూరత్వం లేని ఆ కలిసున్న రోజులే బాగుండెననిపిస్తున్నదని చెప్పుకోవడం ఈ మధ్యన ఎక్కువయ్యింది. ప్రభుత్వ సేవలో ఉన్న తెలంగాణ ప్రముఖులు కలివిడిగానో, విడివిడిగానో, కలిసో, లేఖల ద్వారానో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని పెద్దాయనకు తెలియజేయడం తక్షణావసరం. ఈ ప్రముఖుల మౌనం (కాన్సిపిరేసీ ఆఫ్ సైలెన్స్) రాష్ట్రానికే కాదు, ఆయనకూ ప్రమాదకరం. బలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత కేసీఆర్ ఒక్కరిదే అనుకోరాదు. కనీసం వచ్చే రెండేళ్లు రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం ఒక్కటే అమరవీరులకు నిజమైన నివాళి. నిరంకుశత్వంతో ప్రభుత్వం, అధికారకాంక్షతో బీజేపీ, పట్టుకోసం కాంగ్రెస్ పరిస్థితులను దారుణంగా దిగజారుస్తున్నాయి. కమలం కన్నా గులాబీనే మిన్న అని భావించే బుద్ధిజీవుల్లో నిరాశ, నిస్పృహ, ఆగ్రహం పెరగక ముందే మేల్కొంటే సర్కార్‌కు మంచిది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ‘వొడువని ముచ్చట’లో ఒకచోట అన్నట్టు- ‘తప్పులు రిపీట్జేస్తూ పోతావా? సవరించుకుంట పోతావా? సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ గావాలె’. 


పాలనలో సర్వం తానై వ్యవహరిస్తున్న కేసీఆర్ కుటుంబ బాంధవ్యాలను పక్కనపెట్టి పెద్దరికంతో తప్పొప్పుల మీద చిత్తశుద్ధితో మధ్యంతర సమీక్ష జరిపి సవరణలు చేసుకోవాలి. ఈ కసరత్తును ఎవరూ నామోషీగా భావించాల్సిన అవసరం లేదు. సకాలంలో దిద్దుబాటుకు ఉపక్రమిస్తే నిజంగానే పీకేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, పీకే (ప్రశాంత్ కిషోర్) అవసరమూ ఉండదు. ఆరంభంలో పేర్కొన్న అర శాతం మహానేతల జాబితాలో చేరే సువర్ణావకాశాన్ని కేసీఆర్ వదులుకోకూడదు. ఇప్పుడు కావలిసింది ప్రజాస్వామ్యాన్ని మనసావాచాకర్మణః నమ్మడం, ప్రజాస్వామ్య స్పూర్తితో మెలగడం.

ఎస్. రాము

(సీనియర్ జర్నలిస్ట్‌, కమ్యూనికేషన్ కన్సల్టెంట్) 

Updated Date - 2021-06-23T05:41:46+05:30 IST