Agnipath యువతకు ‘సువర్ణావకాశం’.. త్వరలోనే నియామకాలు : రక్షణ మంత్రి Rajnath Singh
ABN , First Publish Date - 2022-06-17T19:00:00+05:30 IST
అగ్నిపథ్ పథకం(Agnipath Scheme)పై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న తరుణంలో రక్షణశాఖ మంత్రి
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం(Agnipath Scheme)పై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్(Rajnath Singh) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు అగ్నిపథ్ పథకం ఒక ‘సువర్ణావకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పాలసీ కింద ఎంపికైనవారిని ‘అగ్ని వీరులు’గా గుర్తిస్తామని, నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో వారు పనిచేయవచ్చునని సూచించారు. త్వరలోనే అగ్నిపథ్ నియామక ప్రక్రియ ఆరంభమవుతుందని తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా సన్నద్ధమవ్వాలని యువతకు రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
గత రెండేళ్లలో నియామకాలు చేపట్టనందున సైన్యంలో చేరాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశమని రాజ్నాథ్ అన్నారు. నియామకాలు చేపట్టని కారణంగా యువత భవిష్యత్ దృష్ట్యా అభ్యర్థుల వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్ల సంవత్సరాలకు సడలిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మినహాయింపునిచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ సడలింపు ఈ ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. యవతకు ఉపశమనం కల్పించిన ప్రధాని మోడీకి యువకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. కాగా రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల జమ్ముకాశ్మీర్ పర్యటనలో ఉన్నారు.