రైతులకు సబ్సిడీపై కిసాన్ డ్రోన్లు
ABN , First Publish Date - 2022-06-27T05:23:24+05:30 IST
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్యవసాయంలో యాత్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా సబ్సిడీపై డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించాయి.
వ్యవసాయంలో సాంకేతికత
ఆర్బీకేకి మూడు చొప్పున కేటాయింపు
వ్యవసాయ పట్టభద్రులకు 50 శాతం సబ్సిడీ
గుంటూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్యవసాయంలో యాత్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా సబ్సిడీపై డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించాయి. ఈ డ్రోన్లు ప్రధానంగా ఎరువులు, పురుగుమందుల చల్లకం, తక్కువ నీటితో పురుగుమందు పిచికారికి ఉపయోగపడతాయి. గతంలోనే డ్రోన్లతో సాగును అధ్యయనం చేయటానికి కేంద్రం సలహాకమిటీని నియమించింది. పొగాకుబోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు దీనిలో మెంబర్గా ఉన్నారు. అనేక అంశాలను పరిశీలించిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సబ్సిడీపై రైతులకు వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించాయి. వీటిని కిసాన్ డ్రోన్లగా పిలుస్తున్నారు. రైతుభరోసా కేంద్రానికి మూడుచొప్పున కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయాలిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గుంటూరు జిల్లాలో 249, బాపట్ల జిల్లాలో 195, పల్నాడు జిల్లాలో 421 ఆర్బీకేలు ఉన్నాయి. ట్రాక్టర్లు, కస్టమ్స్హైరింగ్ సెంటర్ల తరహాలోనే కిసాన్ డ్రోన్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గుంటూరు వ్యవసాయ శాఖ జేడీ నున్నా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒకేరకం పంటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని అందజేస్తారు. డ్రోన్ ఖరీదు రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. దీనిలో 40శాతం సబ్సిడీ ఉంటుంది. 10 శాతం లబ్ధిదారుడు చెల్లించాలి. 50 శాతం సహకార సంఘాలు, బ్యాంక్లు రుణసౌకర్యం కల్పిస్తాయి. వ్యవసాయ విద్యలో పట్టభద్రులు గ్రూపుగా ఏర్పడితే 50 శాతం సబ్సిడీ ఇస్తారని జేడీ తెలిపారు. కిసాన్ డ్రోన్లకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతి ఉండాలి. రిమోట్ పైలెట్ లైసెన్స్ తీసుకోవాలి. కిసాన్డ్రోన్లకు దరఖాస్తు చేసినవారు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శాఖ ఆమోదం ఉండాలి. నిరుద్యోగులు పది, ఇంటర్ పూర్తిచేసినవారు కూడా గ్రూపుగా ఈ లబ్ధి పొందే అవకాశం వుంది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.