బెజవాడలో ఎయిడెడ్ రచ్చ!
ABN , First Publish Date - 2021-11-12T01:01:51+05:30 IST
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా బెజవాడలో విద్యార్థులు ఉద్యమించారు. విజయవాడ వన్టౌన్లోని శ్రీకన్యకాపరమేశ్వరి విస్పంశెట్టి వెంకటరత్నం హిందూ
విజయవాడ: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా బెజవాడలో విద్యార్థులు ఉద్యమించారు. విజయవాడ వన్టౌన్లోని శ్రీకన్యకాపరమేశ్వరి విస్పంశెట్టి వెంకటరత్నం హిందూ హైస్కూల్ (ఎస్కెపీవీవీహెచ్హెచ్ఎస్)వద్ద గురువారం జనసేన, వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన రభస రభసగా మారింది. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు విఫలయత్నం చేశారు. కొంత మంది విద్యార్థులను పోలీసు జీపులోకి ఎక్కించగానే అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ఆందోళనకారులు పోలీసు జీపునకు అడ్డంగా నిలుచున్నారు. కొంత మంది విద్యార్థులు జీపు ముందు పడుకున్నారు. ససేమిరా జీపును ముందుకు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం జనసేన నాయకుడు పోతిన మహేష్తో సహా 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.