కిటికీలు తెరవండి.. ఇంట్లోకి గాలి రానీయండి!
ABN , First Publish Date - 2021-04-19T07:28:27+05:30 IST
ఆరుబయట కన్నా.. ఇంట్లోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దీని నివారణకు వెంటిలేషన్ ఎంతో మేలు చేస్తుందని...
- మండు వేసవిలో చక్కని వెంటిలేషన్ మేలు: ఎయిమ్స్ చీఫ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఆరుబయట కన్నా.. ఇంట్లోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దీని నివారణకు వెంటిలేషన్ ఎంతో మేలు చేస్తుందని, వేసవిలో ఇళ్లలోకి ధారాళంగా గాలి ప్రసరించేలా కిటికీలు, వెంటిలేటర్లు బాగా తెరిచి ఉంచుకోవాలని సూచించారు. దగ్గు, తుమ్ములతో వెలువడే తుంపరల కన్నా గాలి ద్వారా ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతోందని కొత్త పరిశోధనల్లో వెల్లడైన నేపథ్యంలో రణదీప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తలుపులు, కిటికీలు మూసివేసుకున్న ఇళ్లలో ఒకరికి వైరస్ సోకితే ఇంట్లోని మిగతావారికి కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు వైద్య పత్రిక లాన్సెట్కు ఆయన ఓ ఆర్టికల్ను రాశారు. వైరస్ సోకిన వ్యక్తికి 10 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడితే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవని చెప్పారు. ఎందుకంటే దగ్గినప్పుడు గానీ తుమ్మినప్పుడు గానీ వెలువడే తుంపరలు 5 మైక్రాన్లకన్నా పెద్దవని, ఈ కారణంగా అవి రెండు మీటర్లలోపే నేలమీద పడిపోతాయని విశ్లేషించారు. కరోనా వ్యాప్తి నివారణకు మూడే మూడు మార్గాలను పాటిస్తే సరిపోతుందని.. అవి కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, సమూహాలను నివారించడం, వ్యాక్సినేషన్ను పెంచడం అని పేర్కొన్నారు.