America వెళ్లేవారికి విమాన ఛార్జీల మోత

ABN , First Publish Date - 2021-11-14T12:44:43+05:30 IST

విమానయాన కంపెనీలు విదేశాలు వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రయాణం చేయాలనుకునే వారి నుంచి ముక్కుపిండి మరీ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇండియా నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా...

America వెళ్లేవారికి విమాన ఛార్జీల మోత

విమానయాన కంపెనీలు విదేశాలు వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రయాణం చేయాలనుకునే వారి నుంచి ముక్కుపిండి మరీ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇండియా నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, గల్ఫ్‌ తదితర దేశాలకు ప్రయాణం చేయడంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటీవలే క్రమంగా అంతర్జతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలిగిపోతున్నాయి. తాజాగా అమెరికా సైతం నవంబరు 8 నుంచి ఆంక్షలను సడలించింది. 


ప్రయాణాలపై అమెరికాలో ఉన్న ఆంక్షలు తొలగిపోవడంతో ఎంతో కాలం నుంచి అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఊరట లభించింది. దీంతో విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా విమాన సర్వీసులు లేక ఇక్కట్లు ఎదుర్కొన్న విమానయాన సంస్థలు ఈ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విమాన ఛార్జీలను ఒక్కసారిగా అనూహ్యంగా పెంచేశాయి.


ఇండియా నుంచి అమెరికాకు సింగిల్‌ జర్నీ టిక్కెట్ల ధరల మోత మోగుతోంది. ట్రావెల్‌ ఇండస్ట్రీ వర్గాల అందిస్తున్న సమాచారం ప్రకారం.. నిన్నమొన్నటి వరకు సింగిల్‌ జర్నీ టిక్కెట్టు ధర రూ.87,000ల నుంచి రూ.1.02  వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ టిక్కెట్ల సగటు ధర రూ. 1.5 లక్షలకు చేరుకుంది, ఇక రద్దీ ఎక్కువగా ఉండే వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, షికాగో నగరాల వరకు టిక్కెట్ల ఛార్జీలయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. సింగిల్‌ జర్నీ టిక్కెట్‌ ధర ఏకంగా రూ.3 లక్షల దగ్గరగా ఉంటోంది. ఇక బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధర మొన్నటి వరకు రూ.3.5 లక్షలకు అటుఇటు ఉండగా ఇప్పుడు రూ.6 లక్షలకు పైమాటగానే ఉన్నాయి.


మరోవైపు టిక్కెట్ల ధరలు అనూహ్యంగా పెరిగినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దాదాపు ఏడాదిన్నర తరువాత ప్రయాణాలకు అనుమతులు రావడం, టీకా కార్యక్రమం సైతం పూర్తయిపోవడంతో ఛార్జీలు పెరిగినా సరే అమెరికా ప్రయాణం చేసేందుకే భారతీయులు మొగ్గు చూపుతున్నారు. 


Updated Date - 2021-11-14T12:44:43+05:30 IST