మూడు రోజులపాటు బహిరంగ కార్యక్రమాలకు దూరం: అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-12-23T22:49:04+05:30 IST

త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు ఊపందుకున్నాయి. సభలు, సమావేశాలతో

మూడు రోజులపాటు బహిరంగ కార్యక్రమాలకు దూరం: అఖిలేశ్ యాదవ్

లక్నో: త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు ఊపందుకున్నాయి. సభలు, సమావేశాలతో ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా గడుపుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. మరో మూడు రోజులపాటు ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. అంతేకాదు, పశ్చిమ యూపీలో నేడు జరగాల్సిన ర్యాలీకి కూడా హాజరు కాబోవడం లేదని ప్రకటించారు. 


అఖిలేశ్ యాదవ్ ఇలా ప్రకటించడం వెనక ఓ కారణం కూడా ఉంది. ఆయన భార్య, కుమార్తె కరోనా బారినపడడమే ఇందుకు కారణం. తనకు మాత్రం కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయిన టెస్టు రిపోర్టును  ట్విట్టర్‌లో అఖిలేశ్ షేర్ చేశారు. అయితే, కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా మూడు రోజులపాటు ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోబోనని స్పష్టం చేశారు.


పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌లోని ఇగ్లాస్‌లో లోక్‌దళ్‌తో కలిసి నేడు నిర్వహించే ర్యాలీలో సమాజ్‌వాదీ చీఫ్ పాల్గొనాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. తాను రావడం లేదని ఎలాంటి నిరాశ వద్దని ఘనంగా ర్యాలీ నిర్వహించాలని, కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు అఖిలేశ్ దిశానిర్దేశం చేశారు. 

Updated Date - 2021-12-23T22:49:04+05:30 IST