ఎస్పీకి మద్దతుగా పందెం కాసి నష్టపోయిన కార్యకర్త.. అఖిలేష్ అతడిని పిలిచి ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-03-17T15:36:35+05:30 IST
ఎన్నికలు వస్తున్నాయంటే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోతారు.
ఎన్నికలు వస్తున్నాయంటే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోతారు. తమ తమ పార్టీలకు మద్దతుగా పందాలు కాస్తారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చాలా చోట్ల బెట్టింగ్ జరిగింది. బుందేల్ఖండ్లోని బందాలో కూడా ఇద్దరు స్నేహితులు బెట్టింగ్కు దిగారు. అయితే వారు ధనవంతులు కాదు. డబ్బులు కాకుండా తమ వాహనాలను పందాలు కాశారు. అది కేవలం నోటి మాటకే పరిమితం కాలేదు. రూ.100 బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
సమాజ్వాదీ పార్టీ ఓడిపోతే తన బైక్ను ఇచ్చేందుకు ఎస్పీ మద్దతుదారుడు అవదేశ్ అంగీకరించాడు. ఇక బీజేపీ ఓడిపోతే తన ఆటో ఇచ్చేస్తానని బిలౌతా అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఆరుగురు వ్యక్తుల సమక్షంలో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో అవదేశ్ తన బైక్ను బీజేపీ మద్దతుదారుడికి ఇచ్చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అవదేష్ను ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ఇంటికి పిలిచారు.
అవదేశ్కు రూ.లక్ష చెక్కు, ఒక గోల్డ్ చైన్ అందించారు. ఇంకెప్పుడూ అలాంటి బెట్టింగ్ల్లో పాల్గొనవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అవదేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బెట్టింగ్ చేసినందుకు తనను అఖిలేష్ తిట్టారని అవదేశ్ చెప్పాడు. తనను అఖిలేష్ అద్భుతంగా ఆదరించి రూ.లక్ష, ఒక బంగారు చైన్ బహుమతిగా ఇచ్చారని అవదేశ్ పేర్కొన్నాడు.