కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ ఖరారు
ABN , First Publish Date - 2022-01-22T20:14:25+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్కు తెరపడింది. మైన్పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాజ్వాదీ పార్టీ శనివారంనాడు అధికారికంగా ప్రకటించింది. సమాజ్వాదీ పార్టీ నేత రామ్పాల్ యాదవ్ ఈ ప్రకటన చేశారు.
ఏళ్ల తరబడి మైన్పురి జిల్లా సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా నిలుస్తుండగా, మైన్పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హాల్ నియోజకవర్గంలో 1.44 లక్షల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో అఖిలేష్కు ఇది సురక్షితమైన సీటుగా భావిస్తున్నారు. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అజాంగఢ్ ప్రజలు కోరితే పోటీలోకి దిగుతానంటూ అఖిలేష్ తన పోటీపై ఇటీవల సంకేతాలు ఇచ్చారు. తాజాగా, తమ కుటుంబానికి కలిసి వచ్చిన మైన్పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఖరారు చేసుకున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ చేస్తుండటం ఇదే మొదటిసారి. 2012లో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఎమ్మెల్సీ అయ్యారు. .
అఖిలేష్ హామీల వర్షం..
ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలుస్తామని, వ్యవసాయ భూముల సేద్యానికి ఉచిత కరెంట్ ఇస్తామని, 22 లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని అఖిలేష్ హామీలు గుప్పిస్తున్నారు