మీ భార్య చనిపోయింది.. పోస్ట్మార్టం గదికి తీసుకెళ్లండన్న డాక్టర్.. సరేనని ఆ భర్త తీసుకెళ్తోంటే ఊహించని ఘటన..
ABN , First Publish Date - 2022-02-26T17:48:12+05:30 IST
రెండ్రోజుల క్రితం బైక్ మీద వెళ్తుంటే జరిగిన యాక్సిడెంట్లో ఆమె తీవ్ర గాయాలపాలైంది..
రెండ్రోజుల క్రితం బైక్ మీద వెళ్తుంటే జరిగిన యాక్సిడెంట్లో ఆమె తీవ్ర గాయాలపాలైంది.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తెసుకెళ్లగా పరిస్థితి క్రిటికల్ అని చెప్పి పెద్దాసుపత్రికి పంపించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు.. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ రూమ్కి తీసుకెళ్లాలని సూచించారు.. అయితే ఆ మహిళ ఊపిరి తీసుకుంటుండడాన్ని ఆమె భర్త గమనించాడు.. మరో డాక్టర్కి చూపించగా, ఆమె బతికే ఉందని చెప్పి ఐసీయూలోకి తరలించారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జయారోగ్య హాస్పిటల్కు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రెండ్రోజుల క్రితం జాంబవతి అనే మహిళ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు జయారోగ్య హాస్పిటల్కు పంపించారు. శుక్రవారం సాయంత్రం జాంబవతిని పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ రూమ్కి తీసుకెళ్లాలని భర్తకు సూచించారు.
అతను పోస్ట్మార్టమ్ రూమ్కు తీసుకెళుతూ భార్య వైపు చూడగా ఆమె ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది. గుండె కొట్టుకుంటోంది. దీంతో అతను వేరే డాక్టర్కు చూపించాడు. ఆ డాక్టర్ ఆమె బతికే ఉందని చెప్పి ఐసీయూ రూమ్కు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం విచారణకు ఆదేశించింది.