అన్నింటా రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2021-06-19T05:16:12+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలమైందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై టెక్కలి సబ్కలెక్టర్ కార్యాలయ ఏవో కల్యాణ చక్రవర్తికి పార్టీ నాయకులు వినతిపత్రం అందజే శారు.
- కొవిడ్ బాధితులను ఆదుకోండి
- టీడీపీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు
టెక్కలి : రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలమైందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై టెక్కలి సబ్కలెక్టర్ కార్యాలయ ఏవో కల్యాణ చక్రవర్తికి పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధానంగా ప్రజారోగ్యం కాపాడడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కొవిడ్ నేపథ్యంలో తెల్లరేషన్కార్డు కలిగిన కొవిడ్ బాధిత కుటుంబానికి, అలాగే జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికుల, చిరువ్యాపారులు, వృత్తిదారులకు రూ.10వేలు చొప్పున్న ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. అలాగే కొవిడ్తో మృతిచెందిన కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున్న పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేకే వేలాది మంది కరోనా బారినపడి మృతి చెందారని, కరోనా కట్టడికి వ్యాక్సినే ఏకైక మార్గమని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. పన్నుల పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు పెంపు మూలంగా అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని గుర్తుచేశారు. వీరితో పాటు టీడీపీ జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్, మళ్ల బాలకృష్ణ, వెలమల కామేశ్వరరావు, బగాది శేషగిరిరావు, చాపర గణపతి, మామిడి రాము, పోలాకి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంతోనే కరోనా వ్యాప్తి...
పాలకొండ / రాజాం : కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే పల్లెలు, పట్టణాలు అన్నతేడా లేకుండా కరోనా వైరస్ వేగంగా విస్తరించిందని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు శుక్రవారం ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలో భాగంగా పాలకొండ ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డుదారులందరికీ రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా ఉంటే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున్న పరిహారం వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ మే ఆ పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొత్స వాసుదేవరావునాయుడు, కొల్ల అప్పలనాయుడు, జె.విష్ణు మూర్తి, గురవాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.