All is Well.. సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ డిశ్చార్జ్ : యశోద వైద్య బృందం
ABN , First Publish Date - 2022-03-11T19:46:25+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత యశోద వైద్యులు ప్రెస్మీట్..
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత యశోద వైద్యులు ప్రెస్మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. చేయి నొప్పిగా ఉందని సీఎం చెప్పారని.. అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు మీడియాకు తెలిపారు. ‘కరోనరి యాంజియోగ్రామ్లో ఎలాంటి బ్లాక్స్ లేవు. ఈసీజీ, టూడీ ఈకో పరీక్షలు కూడా చేశాం. కార్డియో వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షలు చేశాం. ఉదయం 8 గంటలకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పారు. మెడ స్పైన్ వల్లే చేయి నొప్పి వచ్చింది. ఎలాంటి ఇబ్బందీ లేదు. రక్తపరీక్షలు కూడా నిర్వహించాం.. ఎలాంటి సమస్యా లేదు.. అంతా బాగుంది (All is Well) వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్కు సూచించాం. బీపీ, షుగర్ కూడా నార్మల్గా ఉన్నాయి. కరోనా తర్వాత ఏమైనా సమస్యలు వచ్చాయేమో అని యాంజియోగ్రామ్ చేశాం. గుండెకు సంబంధించిన ఎలాంటి మేజర్ సమస్యలూ లేవు. దాదాపు 90 శాతం రిపోర్ట్స్ వచ్చాయి. ఎలాంటి ఆందోళన లేదు, ఆరోగ్యంగా ఉన్నారు. వయసు రీత్యా స్వల్ప సమస్యలు ఉండటం సహజమే. విశ్రాంతి తీసుకుంటేనే మంచిది. వరుస పర్యటనలతో నీరసంగా ఉంటున్నారు. సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ను డిశ్చార్జ్ చేస్తాం’ అని యశోద ఆస్పత్రి వైద్య బృందం మీడియాకు వెల్లడించింది.