నేడు చలో అసెంబ్లీ
ABN , First Publish Date - 2020-12-03T05:04:53+05:30 IST
వైసీపీ నేతల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డ అబ్దుల్ సలాంకు న్యాయం కోసం గురువారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి అఖిలపక్షం పిలుపునిచ్చింది.
మైనార్టీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 2 : వైసీపీ నేతల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డ అబ్దుల్ సలాంకు న్యాయం కోసం గురువారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బుధవారం నెల్లూరులోని ఓ హోటల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ఆవాజ్, ఇన్సాఫ్,, వెల్ఫేర్పార్టీ, ఎన్డీపీఐ, ముస్లిమ్లీగ్, హ్యూమన్రైట్స్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అబ్దుల్ సలాం కుటుంబం విషయంలో ప్రభుత్వ వైఖరిని అన్ని పార్టీల నాయకులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాలని తీర్మానించారు. గురువారం ఉదయం 7గంటలకు మద్రాస్ బస్టాండు నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అబ్దుల్ సలాం కేసును సీబీఐకు అప్పగించే వరకు అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ముఫ్తి ఇలియాస్, ఇన్సాఫ్, అజీస్, సిరాజ్, అబ్దుల్, ఉమర్ ఇమాం. షబ్బీర్, జలీల్ఖాన్, సాబిర్ తదితరులు పాల్గొన్నారు.