విజయవాడ జిల్లాకే గన్న..వరం

ABN , First Publish Date - 2022-01-29T06:22:52+05:30 IST

విజయవాడ జిల్లాకే గన్న..వరం

విజయవాడ జిల్లాకే గన్న..వరం
గన్నవరం ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న అఖిలపక్షం నేతలు

బందరు కేంద్రంగా కొత్త జిల్లాలో ఎలా కలుపుతారు..?

గన్నవరంలో అఖిలపక్ష నిరసన 

గన్నవరం, జనవరి 28 : మచిలీపట్నం కేంద్రమైన కృష్ణాజిల్లాలో గన్నవరాన్ని కలిపితే ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోనే ఉంచాలని అఖిలపక్ష కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు సూచించారు. గన్నవరాన్ని విజయవాడలో కలపాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం ప్రదర్శన చేసి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి విజయవాడ జిల్లాతోనే సాధ్యమన్నారు. విజయవాడలో అంతర్భాగంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. రవాణా, విద్య, ఉపాధి, శాంతిభద్రతలు, అంతర్జాతీయ విమానాశ్రయం, కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామికవాడలు, కేసరపల్లి ఐటీ టవర్స్‌ అభివృద్ధి జరగాలంటే గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోనే ఉండాలని చెప్పారు. సీపీఐ ఏరియా కార్యదర్శి పెద్దు వాసుదేవరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న మాట్లాడుతూ గన్నవరం పూర్తిగా విజయవాడలో కలిసిపోయి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. భవిష్యత్తులో గ్రేటర్‌ సిటీ, మెగా సిటీగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు విస్తరణ అంతా గన్నవరం నియోజకవర్గంలోని నున్న, కొండపావులూరు, గన్నవరం ప్రాంతాలపై పడిందని తెలిపారు. ఈ ప్రదర్శనలో జనసేన నాయకుడు చిమట రవివర్మ, సీపీఐ పట్టణ కార్యదర్శి కాట్రగడ్డ జోషి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-01-29T06:22:52+05:30 IST