స్పందన అర్జీలన్నీ పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-06-28T04:46:43+05:30 IST
స్పందన అర్జీదారులకు తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా ఒకేసారి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి(కలెక్టరేట్), జూన్ 27: స్పందన అర్జీదారులకు తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా ఒకేసారి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్వో సత్యనారాయణ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీదారులను పదే పదే తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్ చేయాలన్నారు. స్పందన అర్జీలు ఎట్టి పరిస్థితుల్లో బియాండ్ ఎస్ఎల్లోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. అర్జీ దారులే ఎండార్స్మెంట్ ఇచ్చేటప్పుడు హెచ్వోడీలు తప్పకుండా పరిష్కార నివేదిక చదివి అర్జీదారునికి పంపాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి స్పందన కార్యక్రమానికి వస్తుంటారని, అధికారులందరూ బాధితుల సమస్యలపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగుల బదిలీలు చేయాలని వివిధ శాఖల హెచ్వోడీలకు సూచించారు. అన్నమయ్య జిల్లాలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరని ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లే వారి స్థానంలో తప్పకుండా ఇంకొకరిని నియమించేటట్లయితే వారికి బదిలీకి రికమండ్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని చిన్నమండెం మండలం కుమ్మరపల్లెకు చెందిన గురయ్య, ఇంటిస్థలం మంజూరు చేయాలని రాజంపేట మండలం ఇసుకపల్లెకు చెందిన కె. నీరజ, సర్వే నెంబరు 388/4లో 5 ఎకరాల తన భూమి ఆన్లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని మదనపల్లె మండలం ఎనుములవారిపల్లెకు చెందిన కే. కృష్ణమూర్తి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు.