దెబ్బకు దెబ్బ.. యూకే పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన భారత్

ABN , First Publish Date - 2021-10-02T02:31:06+05:30 IST

అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను ఇటీవల సవరించిన యూకే భారత్ నుంచి వచ్చే వారికి క్వారంటైన్

దెబ్బకు దెబ్బ.. యూకే పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన భారత్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను ఇటీవల సవరించిన యూకే భారత్ నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడంతో పాటు పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు, వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని కూడా టీకా వేయించుకోని వారిగానే పరిగణిస్తామని పేర్కొంది.


 ఈ నేపథ్యంలో తాజాగా భారత్ కూడా దీటుగా స్పందించింది. అలాంటి నిబంధనే యూకే పౌరులకు కూడా విధించింది. ఈ నెల 4 నుంచి భారత్ రావాలనుకునే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. అలాగే, భారత్‌లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూకేలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతుండడం కూడా భారత్ నిర్ణయానికి ఓ కారణం. 


ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం..

* అక్టోబరు 4 నుంచి తాజా నిబంధనలు వర్తిస్తాయి

* ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి

* భారత్ చేరుకున్న తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి

* దేశంలో అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి

* ఇండియాకు చేరుకున్న తర్వాత ఇంటిలో కానీ, గమ్యస్థాన ప్రదేశంలో కానీ 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి  

Updated Date - 2021-10-02T02:31:06+05:30 IST