ఇద్దరు యువతుల పెళ్లిని గుర్తించేందుకు తిరస్కరించిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-04-14T18:55:45+05:30 IST

తమ పెళ్లిని గుర్తించాలని ఇద్దరు యువతులు చేసిన విజ్ఞప్తిని

ఇద్దరు యువతుల పెళ్లిని గుర్తించేందుకు తిరస్కరించిన హైకోర్టు

అలహాబాద్ : తమ పెళ్లిని గుర్తించాలని ఇద్దరు యువతులు చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. హిందూ వివాహ చట్టం సజాతి వ్యక్తుల పెళ్లిని వ్యతిరేకించడం లేదని వీరు చేసిన వాదనను కూడా తిరస్కరించింది. అంజూ దేవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. 


అంజూ దేవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో 23 ఏళ్ళ వయసుగల తన కుమార్తెను 22 ఏళ్ళ వయసుగల యువతి చట్టవిరుద్ధంగా నిర్బంధించినట్లు  ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఇద్దరు యువతులను తదుపరి విచారణ తేదీనాడు హాజరుపరచాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 6న ఆదేశించింది.


ఏప్రిల్ 7న జరిగిన విచారణకు ఈ యువతులిద్దరూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ సమక్షంలో హాజరయ్యారు. హిందూ వివాహ చట్టం కేవలం ఇద్దరు వ్యక్తుల వివాహం గురించి మాత్రమే చెప్తోందని, హోమోసెక్సువల్ వివాహాన్ని ఈ చట్టం వ్యతిరేకించడం లేదని వాదించారు. 


ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం భారతీయ చట్టాలకు వ్యతిరేకమని చెప్పారు. హిందూ సంస్కృతిలో పెళ్లి అంటే పవిత్రమైన  సంస్కారమని, ఓ పురుషుడు, ఓ స్త్రీ పెళ్లి చేసుకోవచ్చునని చెప్పారు. మన దేశం భారతీయ సంస్కృతి, మతాలు, చట్టాల ప్రకారం నడుస్తోందన్నారు. పెళ్లిని ఓ పవిత్రమైన సంస్కారంగా పరిగణిస్తామని తెలిపారు. ఇతర దేశాల్లో పెళ్లి అంటే ఓ కాంట్రాక్టు అని తెలిపారు. హైకోర్టు ఈ యువతుల వాదనను, విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను పరిష్కరించింది. 


సజాతి వ్యక్తుల వివాహాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదని, జీవసంబంధ పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే వ్యవస్థ అని తెలిపింది. 


Updated Date - 2022-04-14T18:55:45+05:30 IST