పెద్దారెడ్డిపేటలో ఇళ్ల స్థలాలు కేటాయించండి

ABN , First Publish Date - 2022-10-04T05:13:20+05:30 IST

మండలంలోని పెద్దారెడ్డిపేటకు చెందిన అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ పోలీస్‌ సతీశ్‌కుమార్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను కోరారు.

పెద్దారెడ్డిపేటలో ఇళ్ల స్థలాలు కేటాయించండి
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్‌ పోలీస్‌ సతీశ్‌కుమార్‌

 ఎమ్మెల్యే  క్రాంతికిరణ్‌కు సర్పంచ్‌ సతీశ్‌కుమార్‌ వినతి

పుల్‌కల్‌, అక్టోబరు 3: మండలంలోని పెద్దారెడ్డిపేటకు చెందిన అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ పోలీస్‌ సతీశ్‌కుమార్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను కోరారు. సోమవారం ఆయన గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పుల్లయ్యగారి సుభా్‌షచందర్‌తో కలిసి అందోలులోని ఎమ్మెల్మే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ శివారులో మూడెకరాల ప్రభుత్వ స్థలం ఉన్నదని, ఆ స్థలంలో ప్లాట్లు చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని విన్నవించారు. దీంతో పాటు గ్రామ సమీపంలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయడం లేదని ఎమ్మెల్యేకు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. పెద్దారెడ్డిపేట, రాయిపాడ్‌, మంతూరు గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అమర్చకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులకు తరచుగా విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని, ఫలితంగా అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ స్పందించి ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సర్పంచ్‌ పోలీస్‌ సతీశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-10-04T05:13:20+05:30 IST