నగర పంచాయతీలో తగ్గిన ఇంటి పన్నులు
ABN , First Publish Date - 2022-05-18T03:55:45+05:30 IST
అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని మజరా గ్రామాల్లో పేదల ఇళ్లకు ఇంటి పన్నులు తగ్గాయి.
జీవో 198తో పేదలకు ఉపశమనం
అల్లూరు, మే 17 : అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని మజరా గ్రామాల్లో పేదల ఇళ్లకు ఇంటి పన్నులు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 198 ప్రకారం 375 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే తక్కువగా నిర్మితమైన భవనాలకు ఏడాదికి రూ.54 వసూలు చేయాలని నిర్ణయించారు. 2020 నవంబరు 23న విడుదల చేసిన ఈ జీవోను ప్రస్తుతం అమలు చేస్తుండడంతో అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని అల్లూరుతోపాటు నార్తుమోపూరు, సింగపేట పంచాయతీల్లో ఉన్న సుమారు 28 మజరా గ్రామాల్లోని పేదప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా పేదలు నివశిస్తుండగా వారి నివాస గృహాలు 375 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉండడంతో వేడి నీటికి చన్నీళ్లు తోడన్నట్టు ఈ జీవో ఉపయోగపడుతోంది. కాగా అల్లూరు నగర పంచాయతీలో నార్తుమోపూరు, సింగపేట పంచాయతీలను కలిపి నగర పంచాయతీగా రూపొందించాలని రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు తమ గ్రామాన్ని కలపొద్దని నార్తుమోపూరు గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గవర్నర్ ఆర్డినెన్స్తో అల్లూరు, సింగపేట, నార్తుమోపూరులలో నగర పంచాయతీ పాలన చేపట్టారు. దీంతో ఇంటి పన్నులు అమాంతం పెంచేసిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో జీవో 198 ప్రకారం ఉపశమనాన్ని కలిగిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.